● అతివేగంగా బైక్ను ఢీకొట్టిన వైనం ● పెళ్లికి వచ్చి వెళ్తున్న తోడల్లుళ్లు దుర్మరణం
గంపలగూడెం/ఎర్రుపాలెం: ఒక ప్రమాదం అక్కా చెల్లెళ్ల పసుపు, కుంకుమను తుడిచేసింది. అతి వేగంగా, అజాగ్రత్తగా ట్రాక్టర్ నడిపిన డ్రైవర్ బైక్ను ఢీకొట్టగా ఇద్దరు మృతి చెందారు. మృతులిద్దరూ తోడల్లుళ్లు కావడంతో వారి కుటుంబంలో తీర్చలేని విషాదాన్ని నింపింది. ఖమ్మం జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన ముల్లంగి లాజర్, జవ్వాయమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒకరిని బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పెసరమల్లి నాగరాజు వివాహం చేసుకున్నాడు. మరో కుమార్తెకు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొరకొప్పుల రమేష్తో వివాహం జరిగింది. నాగరాజు బతుకుదెరువు నిమిత్తం ఇటీ వల హైదరాబాద్ వెళ్లగా, రమేష్ ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులోని రైస్ మిల్లులో పని చేస్తున్నాడు. వారిద్దరు ఆదివారం బుచ్చిరెడ్డిపాలెంలోని తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా రామాలయం వెనకాల మెయిన్ రోడ్డుపై మలుపు వద్ద గ్రావెల్ లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ బైక్ను ఢీకొట్టాడు. ఆపై ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడగా నాగరాజు, రమేష్ దాని కిందపడి తీవ్రగాయాలతో అక్కడక్కడే మృతి చెందారు. ఒకే ప్రమాదంలో తోడల్లుళ్లు ప్రాణాలు విడవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలిసి వారి భార్యాపిల్లలు, కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ ఎం. రమేష్కుమార్ జేసీబీ సాయంతో ట్రాక్టర్ను తొల గించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు. నాగరాజుకు భార్య, కుమారుడు, కుమార్తె, రమేష్కు భార్య ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కొరకొప్పుల రమేష్ (ఫైల్)
పెసరమల్లి నాగరాజు (ఫైల్)


