దుర్గమ్మ సన్నిధిలో వైభవంగా ఉత్సవాలు నూతన పూజామండపంలో విశేష పుష్పార్చన వెండి రథంపై ఆదిదంపతుల నగరోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గురువారం నుంచి వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి విశేష సుగంధ పుష్పాలతో అర్చన జరగనుంది. నూతన పూజా మండపంలో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించేందుకు ఆలయ వైదిక కమిటీ ఏర్పాట్లు చేసింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి గురువారం తెల్లవారుజామున స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం ఎనిమిది గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. కళావేదికపై పంచాంగ పఠనం జరుగుతుంది. తెలుగు సంవత్సరాది నేపధ్యంలో అమ్మ వారి ఆలయాన్ని పూలతో విశేషంగా అలకరించారు.
మల్లెలు, మరువంతో అర్చన
వసంత నవరాత్రోత్సవాలలో తొలి రోజైన గురువారం అమ్మవారికి మల్లెపూలు, మరువంతో విశేషంగా అర్చన జరుగుతుంది. తొలుత అర్చన నిర్వహించే పుష్పాలతో ఆలయ అర్చకులు, వేద పండితులు ఊరేగింపుగా పూజామండపానికి చేరుకుంటారు. పుష్పార్చన అనంతరం ఆయా పుష్పాలను భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ సేవలో పాల్గొనే భక్తులు రూ.2500 టికెట్ కొనుగోలు చేయాలి. ఉగాదిని పురస్కరించుకుని శ్రీ గంగ, పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లకు వెండి రథంపై నగరోత్సవాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు మహామండపం నుంచి ఊరేగింపు ప్రారంభమై కనకదుర్గనగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, జమ్మిదొడ్డి, కోమల విలాస్, రమణయ్య కూల్డ్రింక్స్ షాపు, బోడెమ్మ హోటల్, వన్టౌన్ పోలీస్ స్టేషన్, సామారంగం చౌక్, శ్రీను హోటల్, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది.


