‘మీ కోసం’లో కలెక్టర్ డీకే బాలాజీ ప్రజల నుంచి 109 అర్జీలు స్వీకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చే అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కారవేదిక (మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు జేసీ ఎం. నవన్, డీఆర్వో చంద్రశేఖరరావు, జిల్లా విజిలెన్స్ అధికారి పోతురాజు, డీఎస్పీ శ్రీనివాసరావు అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతన్నా మీ కోసం రెండో విడత కార్యక్రమం ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు ఐదు అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం వ్యవసాయశాఖ రూపొందించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. మీ కోసం కార్యక్రమంలో అధికారులు 109 అర్జీలను స్వీకరించారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామంలో మహాలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్మిల్లు నూతనంగా నిర్మించుకున్న డ్రైయ్యర్ వల్ల అవస్థలు పడుతున్నామని గ్రామ శివారు ఎన్టీఆర్ కాలనీవాసులు పేర్కొన్నారు. డ్రైయ్యర్ కారణంగా ఇళ్లలోకి విపరీతమైన దుమ్మూ, ధూళి వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని వివరించారు. ఇప్పటికే దీని కారణంగా ఒకరు చనిపోయారని, ముగ్గురు ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వాపోయారు. అంతేకాకుండా మంచి నీటి చెరువు కూడా కలుషితమవుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు అర్జీ ఇచ్చారు.


