చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములు అని, ఆయన పట్టుదల ఆదర్శనీయమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరావతిలో 58 అడుగుల స్టాట్ట్యూ ఆఫ్ శాక్రిఫైజ్ కాంస్య విగ్రహాన్ని నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించిన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గాంధేయ వాది అయిన పొట్టి శ్రీరాములులోని పట్టుదల, త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రసంగించారు. డీఆర్వో చంద్రశేఖరరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి పాల్గొన్నారు.


