మచిలీపట్నంటౌన్: జనసేన నాయకులు మచిలీపట్నంలో జెండా రాజకీయాలకు తెరలేపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఇంటి సమీపంలోని రామానాయుడుపేట సెంటర్లో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ జెండా దిమ్మె లేదు. నిత్యం రద్దీగా ఉండే ఈ సెంటర్లో రాత్రికి రాత్రే జెండా దిమ్మె ఏర్పాటుకు జనసేన నాయకుల ప్రయత్నించారు. ఈ విషయం తెలిసిన వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న, పార్టీ నాయకుడు గాజుల భగవాన్, కార్యకర్తలు అక్కడకు చేరుకుని జెండా దిమ్మె నిర్మిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయని, నిర్మాణం నిలిపివేయాలని కోరారు. ఈ క్రమంలో జనసేన నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో రెండు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు అక్కడకు వచ్చి కేవలం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి బలవంతంగా పంపించారు. కొద్దిసేపటి తరువాత జనసేన నాయకులను కూడా అక్కడి నుంచి పంపించారు. జనసేన నాయకులు రెచ్చగొట్టే ధోరణి అవలంబిస్తున్నారని సుబ్బన్న ఆరోపించారు. అధికారం ఉందని జనసేన నాయకులు పాల్పడే చర్యలను గట్టిగా తిప్పికొడతామన్నారు.
మచిలీపట్నంఅర్బన్: విద్యార్థులను ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేయడంతో పాటు ఆర్థికాభివృద్ధికి ఒకేషనల్ విద్య దోహదపడుతుందని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు తెలిపారు. కృష్ణవేణి ఐటీఐ కళాశాలలో ఒకేషనల్ విద్యకు సంబంధించి గురువారం ఒక రోజు ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేషనల్ విద్య విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలను అందించి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు సహాయపడుతుందన్నారు. సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కుముదిని సింగ్ మాట్లాడుతూ.. ఒకేషనల్ విద్యను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జీసీడీఓ జి.సీతామహాలక్ష్మి, ఏపీఓ కె.ఏడుకొండలు, ఏఎంఓ శ్యామ్, ఎంఐఎస్ సుభాన్, సీఎంఓ టి.రమేష్, వీసీఎస్ జి.పద్మజ, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఒకేషనల్ ట్రైనర్లు పాల్గొన్నారు.


