మిధున్రెడ్డికి బెయిల్ షరతుల సడలింపు కోరుతూ పిటీషన్
విజయవాడలీగల్: మద్యం అక్రమ కేసులో బెయిల్పై వున్న వైఎస్సార్ సీపీ పార్లమెంటు ఫ్లోర్ లీడర్, ఎంపీ మిధున్రెడ్డి బెయిల్ షరతుల సడలింపు కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. ఢిల్లీ పార్లమెంటు హౌస్లో మంగళవారం 20వ తేదీన జరిగే ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ సమావేశంలో, ఈనెల 26న జరిగే గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు బెయిల్ షరతులను సడలింపు కోరుతూ మిధున్రెడ్డి తరఫు న్యాయవాది చంద్రగిరి విష్ణువర్ధనరావు సోమవారం ఏసీబీ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఈనెల 23, 26 తేదీలలో విచారణకు సడలింపు కావాలని పిటీషన్లో పేర్కొన్నారు.
సిట్ విచారణకు హాజరైన మిధున్రెడ్డి
సోమవారం నగర పోలీసు కమిషనరేట్లోని సిట్ కార్యాలయానికి ఎం.పి మిధున్రెడ్డి తన న్యాయవాది చంద్రగిరి విష్ణువర్ధన్తో హాజరయ్యారు. విచారణలో మిధున్రెడ్డి విచారణాధికారికి పూర్తిగా సహకరించారు. అనంతరం ఢిల్లీ పర్యటన నిమిత్తం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
మద్యం అక్రమ కేసులో
బెయిల్ పిటీషన్పై విచారణ
ఈ కేసులో జైలులో రిమాండ్లో ఉన్న అనిల్చోక్రా, రోణక్కుమార్ పాల్ఘాట్ తరపున న్యాయవాదులు పిట్టల శ్రీనివాస్, విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ ఏసీబీ న్యాయస్థానంలో బెయిల్ పిటీషన్లు దాఖలు చేశారు. పిటీషన్లపై కౌంటరు దాఖలు చేయాలని ప్రాసిక్యూషన్ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. అనిల్చోక్రా, రోణక్కుమార్ల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు రెండవసారి ఏడు రోజుల కస్టడీ కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రాసిక్యూషన్ తరఫు వాదనలు వినిపించారు. న్యాయమూర్తి తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు.


