ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు
కొత్త సంవత్సరంలో జరిగిన ఘటనలు..
● ఎన్టీఆర్ జిల్లాలో వెలుగుచూస్తున్న
వరుస ఘటనలు
● మాటామాటా పెరిగి హత్యలు
● మద్యం కొనుగోలుకు
రూ.10 ఇవ్వలేదని హతమార్చిన వైనం
● రౌడీషీటర్లపై పనిచేయని
పోలీసు హెచ్చరికలు
● సంక్రాంతి పండుగ నేపథ్యంలో
విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
● గంజాయి అమ్మకాల్లో
రౌడీ షీటర్లది కీలక పాత్ర
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంటోంది. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలిశాయి. మద్యం మత్తులో మందుబాబులు తెగబడుతున్నారు. వీరంగం సృష్టిస్తున్నారు. మద్యం మత్తులో జరుగుతున్న దాడుల్లో రౌడీషీటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. పోలీసులు వారం వారం స్టేషన్కు పిలిపించి, హెచ్చరికలు జారీ చేస్తున్నా.. కొంత మంది పద్ధతుల్లో మార్పు రావటం లేదు. మద్యం మత్తులో.. క్షణికావేశంలో ఏకంగా ప్రాణాలనే తీస్తున్నారు.
యువకులను మత్తుకు బానిసలుగా చేస్తూ..
మద్యం మత్తుకు తోడు రౌడీషీటర్లకు, గంజాయికి విడదీయరాని బంధం పెనవేసుకుంది. కొంత మంది గంజాయిని ఆదాయ వనరుగా మార్చుకొని గ్యాంగ్లను పోషిస్తున్నారు. విజయవాడలో 470 మంది రౌడీషీటర్లు, 350 మంది సస్పెక్ట్ షీటర్లు ఉన్నారు. 130 మంది క్రియాశీలకంగా ఉంటూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 55 మందిపైన నగర బహిష్కరణ విధించారు. వీరిలో పలువురు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తెప్పించి, నగరంలో ఆదాయం పొందుతున్నారు. కొంత మంది రౌడీషీటర్లు ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో గంజాయి కొని తెచ్చి నగరంలో విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. వీరు తమ అనుచరులతో కలిసి విద్యార్థులు, పనులు చేసుకొనే యువకులను గుర్తించి వారికి గంజాయి సరఫరా చేసి బానిసలుగా మార్చుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్లు తీసుకొంటూ వివిధ ప్రాంతాల్లో గంజాయి ప్యాకెట్లు అందించిన ఘటనలు ఉన్నాయి. నగర బహిష్కరణకు గురైన రౌడీషీటర్లు పోలీసులకు చిక్క కుండా కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోకి వచ్చే శివారు ప్రాంతాల్లో మకాం వేసి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.
కండ్రికలోని ఓ బార్లో జరిగిన దాడిలో గాయపడిన యువకుడు(ఫైల్)
జగ్గయ్యపేటలో బీరు సీసా తో పొడవడంతో మృతి చెందిన నవీన్(ఫైల్)
ఈ నెల 11వ తేదీన వీరులపాడు మండల పరిధి జుజ్జూరు గ్రామంలో రాత్రి 11గంటల సమయంలో నందిగామ నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు కొమ్మూరు శేషు, అతని అనుచరులు ఫుల్గా మద్యం తాగి.. వైఎస్సార్ సీపీకి చెందిన షేక్ ఫయాజ్, అతని భార్య సల్మా, కుమారులు అయాన్, ఆర్యన్లపై విచక్షణారహితంగా దాడి చేశారు.
విజయవాడ కేదారేశ్వరపేట 8వ లైన్ ఎర్రకట్ట ప్రాంతానికి చెందిన ధర్మవరపు మోహ న్ కుమార్(24) ఓ పార్సిల్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఈనెల 15వ తేదీ సంక్రాంతి కావడంతో ప్రభాస్ కాలేజీ వద్ద ఉన్న మాధురి బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. కౌంటర్లో పార్సిల్ తీసుకుంటుండగా అయోధ్య నగర్ ప్రాంతానికి చెందిన రాము, సాల్మన్ అనే వ్యక్తులు మోహన్ తలపై బీరు బాటిల్తో బలంగా కొట్టారు. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానిక వ్యక్తులపై కూడా రాము, సాల్మన్లు దాడి చేశారు.
నున్న రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్రిక సమీపంలో ఉన్న పల్స్ బార్లో మూడు రోజుల క్రితం మద్యం బాబుల మధ్య వివాదం జరిగింది. శాంతినగర్, కండ్రిక ప్రాంతాలకు చెందిన యువకులు బార్లో బీరు సీసాలతో దాడులు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు
ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు
ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు
ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు


