తిరుగు ప్రయాణాల రద్దీ
●సమస్యలు తలెత్తకుండా చర్యలు
●ట్రాఫిక్ డీసీపీ షిరీన్బేగం
లబ్బీపేట(విజయవాడతూర్పు)/ఇబ్రహీంపట్నం: ‘సంక్రాంతికి హైదరాబాద్ నుంచి వచ్చిన వారు తిరుగు ప్రయాణంతో తీవ్రమైన రద్దీ ఏర్పడు తోంది. వేలాది వాహనాలు ఒక్కసారిగా ఒకేవైపు ప్రయాణించడంతో పలు కూడళ్లలో ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఇబ్రహీంపట్నంలో సమస్య ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ సమస్య ఎదురుకాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్లు’ ట్రాఫిక్ డీసీపీ షిరీన్బేగం చెప్పారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆదేశాలతో జిల్లాలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రియల్టైమ్ డేటా వినియోగం, డ్రోన్లతో లైవ్ డేటా అంచనా వేసినట్లు తెలిపారు. పర్యవేక్షణ.. సమగ్ర చర్యలతో శనివారం విపరీతమైన వాహన రద్దీ ఉన్నా నియంత్రించామన్నారు.
రెండో రోజూ రద్దీ
తిరుగు ప్రయాణాల కారణంగా వాహనాల రద్దీ ఆదివారం కూడా కొనసాగుతున్నట్లు డీసీపీ షిరీన్ బేగం తెలిపారు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతంలో నేషనల్ హైవేపై కొంతమేర ట్రాఫిక్ ఒత్తిడి ఏర్పడుతోందన్నారు. హెవీ వాహనాలను రద్దీ లేని (నాన్–పీక్) సమయాల్లో మాత్రమే విజయవాడ దాటేలా ప్రణాళిక చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారన్నారు.


