జూద క్రాంతులు!
గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి, రామవరప్పాడు వద్ద టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన శిబిరాల్లో పందేలు రూపంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్లో పేకాట, కేసినో నిర్వహించారు. రూ. 10 వేలు కట్టి ఎంట్రీ ఫీజు కట్టిన వారిని మాత్రమే ఎంట్రీ బ్యాండ్ ఇచ్చి లోపలికి అనుమతించారు. వీరికి అన్ లిమిటెడ్ మందు, ఆహారం సరఫరా చేశారు. కేవలం కోడి పందేల కోసం మరో మూడు చిన్న బరులు ఏర్పాటు చేశారు. ఇంకా లోపల బయట, గుండాట వంటి శిబిరాలు పదుల సంఖ్యలో ఏర్పాటు చేశారు. పాయకాపురం సమీపంలోనూ కేసినో శిబిరం నిర్వహించారు.
పెనమలూరు నియోజకవర్గంలోని యనమలకుదురు, పెద్దపులిపాక, కంకిపాడు మండలం ఈడుపుగల్లు, ఉప్పలూరు, కంకిపాడు, గొడవర్రు, ఉయ్యూరు మండలంలోని కాటూరు ఆకునూరు గ్రామాల్లో మొత్తం తొమ్మిది బరులు నిర్వహించారు. ఆకునూరు, ఉప్పులూరు గ్రామాల్లో కేసినో తరహా జూద క్రీడలు జరిపించారు. ఎంట్రీ టికెట్ లక్ష రూపాయల చొప్పున బరుల నిర్వాహకులు వసూలు చేశారు. మూడు రోజులు పాటు నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 200 కోట్ల పైగా వ్యాపారం సాగినట్టు సమాచారం.
అవనిగడ్డ నియోజకవర్గంలో ఈ మూడు రోజుల్లో రూ. 3కోట్లకుపైగా జూదం జరిగింది. మొత్తం 12చోట్ల కోడిపందేల బరులు, 13 చోట్ల పేకాట శిబిరాలు నిర్వహించారు. అవనిగడ్డ, నాగాయలంక, మోపిదేవి, కోడూరు మండలాల్లో ఈ శిబిరాలు కొనసాగాయి. పులిగడ్డ, నాగాయలంకలోని టి.కొత్తపాలెం రోడ్డులో, కోడూరులో ప్రధాన రహదారి పక్కన పందేలు వేయడంతో వాహనాలు నిలపడం వల్ల వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మచిలీపట్నం నియోజకవర్గంలోని బందరు నార్త్ మండలం పరిధిలో చిలకలపూడి రైల్వేస్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన బరిలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మేకవానిపాలెం, మంగినపూడి రహదారిలోని డాబాల సెంటరు, తాళ్లపాలెంలో ఏర్పాటు చేసిన బరుల్లో కోడిపందేలు, కోత ముక్క, గుండాట పెద్ద ఎత్తున నిర్వహించారు. బందరు సౌత్ మండల పరిధి, చిన్నాపురం, పోలాటితిప్ప గ్రామంలో జూద క్రీడలు విచ్చలవిడిగా సాగాయి.
పెడన మండలంలోని పలు గ్రామాల్లో జూదం విచ్చలవిడిగా సాగింది. కొన్ని చోట్ల తీవ్ర నష్టాల్లో ఉన్నామని, శని, ఆదివారాలు కూడా అనుమతులు ఇవ్వాలని పోలీస్ వారిపై నిర్వాహకులు తీవ్ర ఒత్తిళ్లు తీసుకువస్తున్నట్లుగా సమాచారం. బంటుమిల్లిలోని పెందుర్రు, గూడూరు మండలంలో గూడూరులో, కృత్తివెన్నులో యథావిధిగా జూదాలు కొనసాగుతున్నాయి.
గుడివాడ నియోజకవర్గంలోని గుడివాడ, నందివాడ గుడ్లవల్లేరు మండలాల్లో అధికార పార్టీ నాయకులు 9 బరులు ఏర్పాటు చేసి యథేచ్ఛగా కోడిపందేలు, కోతముక్క, గుండాటను నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 దాటినా కూడా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడలేదు. రాత్రి 11 గంటల వరకు అన్ని బరుల్లో జూదాలు విచ్చలవిడిగా నిర్వహిస్తామని, అధికార పార్టీ నాయకుల ద్వారా ముందస్తుగానే సమాచార మిచ్చినట్లు తెలుస్తోంది.
పామర్రు నియోజకవర్గంలోని కొన్ని బరుల వద్ద కోడి పందేల సమయంలో చిన్న, చిన్న గొడవలు జరిగాయి. మద్యం మత్తులో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
బరుల వద్దే బార్లు..
విజయవాడ రామవరప్పాడు సమీపంలో ఏర్పాటు చేసిన బరుల వద్ద పార్క్ చేసిన వాహనాలు
కేసరపల్లిలో చిన్నబజార్, పెద్ద బజార్ ఆడుతున్న పందెం రాయుళ్లు
నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు బరుల కేటగిరీని బట్టి రూ.30 లక్షల నుంచి రూ.2కోట్లకు పైగా దండుకున్నారు. పోలీసులు తామేమి తక్కువ కాదన్నట్లు బరుల వద్ద బేరం కుదుర్చుకున్నారు. దీంతో బరుల నిర్వాహకులు రెచ్చిపోయారు. తమకు అడ్డూ అదుపూ లేదన్నట్లు, రేకులతో పెద్ద, పెద్ద వాటర్ ప్రూఫ్ షెడ్లు ఏర్పాటు చేసి, అందులో సకల సౌకర్యాలు కల్పించారు. విచ్చలవిడిగా కేసినో నిర్వహించి రూ.కోట్లు కొల్లగొట్టారు. గోవా, నేపాల్ నుంచి నిపుణులను రంగంలోకి దించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి కోసం, లక్ష రూపాయలు ఎంట్రీ ఫీజు పెట్టి మద్యం, విందు ఏర్పాటు చేశారు. వీరికోసం కారవ్యాన్లు కూడా అందుబాటులో ఉంచారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సంక్రాంతి సంబరాల ముసుగులో హైటెక్ బరులు ఏర్పాటు చేసి, అడ్డగోలుగా పచ్చనేతలు కోట్లు దండుకున్నారు. మూడు రోజులూ రాత్రింబగళ్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో యథేచ్ఛగా కోడిపందేలు, జూద క్రీడలు, కేసినో ఏర్పాటు చేశారు. కళ్లెదుటే పందెం పుంజులు కత్తులు దూస్తున్నా, పేకలు గాలిలో ఎగుతున్నా, చినబజారు, పెద్దబజారు, లోన, బయట, గుండాట, కోతముక్క, త్రీకాట్స్, ఆటలు జోరుగా ఓపెన్గా సాగుతున్నా పోలీసు, రెవెన్యూ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు.
బరుల వద్ద మద్యం ఏరులై పారింది. భారీ స్టాల్స్, బార్ల మాదిరి ఏర్పాటు చేసి జోరుగా మద్యం అమ్మకాలు చేశారు. భారీగా రేట్లు పెంచి సొమ్ము చేసుకున్నారు. కొంత మంది ద్విచక్రవాహనాలు, ఆటోల్లో పెట్టుకొని గ్లాసుల్లో మద్యం పోసి, మందు బాబులకు అమ్మకాలు చేశారు. ఆ పక్కనే బిర్యానీ సెంటర్లు, మాంసం దుకాణాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ పేరుతో భారీ దోపిడీకి తెగబడ్డారు. విజయవాడ శివారులో మూడు ప్రధాన బరుల వద్ద ద్విచక్ర వాహనానికి రూ.50, కార్లకు రూ.200 కేవలం మూడుగంటల సమయానికే తీసుకున్నారు. వేలాది వాహనాలు బరుల వద్ద బారులు తీరడంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది. కనీసం పోలీసులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు.
జూద క్రాంతులు!
జూద క్రాంతులు!


