ఆత్మీయ కలయికలతో అసమానతలు లేని సమాజం
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): అసమానతలు లేని సమాజం కోసం ఇలాంటి ఆత్మీయ కలయికలు తరచూ జరగాలని సమతా పార్టీ జాతీయ కమిటీ మాజీ అధ్యక్షుడు వీవీ కృష్ణారావు అన్నారు. విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో సంక్రాంతి ఆత్మీయ కలయిక ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకతీతంగా గత 10 సంవత్సరాలుగా ఈ ఆత్మీయ కలయికను నిర్వహిస్తున్నానన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని చెప్పారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రజల పరం కావాలని, అసమానతలు లేని సమాజమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కృష్ణారావు ఆకాంక్షించారు. విధానాలు వేరైనా అభ్యుదయం, సమానత్వం కోసం ఆత్మీయంగా అందరూ కలిసి పనిచేయాలన్నారు.
పాల్గొన్న ప్రముఖులు..
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తూ రాష్ట్రాలపై బలవంతంగా రద్దుతోందన్నారు. ఆత్మీయ కలయికలో ఎమ్మెల్సీ బి.టి.నాయుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పోలీస్ విశ్రాంత అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ షుబ్లీ, సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, సీపీఐ నాయకురాలు అక్కినేని వనజ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్.బాబూరావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలనుకొండ శివాజీ, బీజేపీ నాయకుడు లక్ష్మీపతి రాజా, జీఎస్టీ(ఆడిట్) కమిషనర్ ఆనంద్, ప్రెస్ అకాడమీ చైర్మన్ సురేష్కుమార్, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, హైకోర్టు న్యాయవాది రవితేజ, మాదిగ దండోరా నాయకుడు కృపాకరరావు తదితరులు పాల్గొన్నారు.


