వివాహిత దారుణ హత్య
మైలవరం: మండల కేంద్రం రెడ్డిగూడెం శివారు రాఘవాపురంలో సంగెపు శ్రావణి(30)అనే వివాహిత ఆదివారం రాత్రి హత్యకు గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సంగెపు శ్రావణి అనే వివాహిత విస్సన్నపేటలో ఒక వస్త్రాల దుకాణంలో పనిచేస్తోంది. యథావిధిగా ఆదివారం తను విధులు ముగించుకుని రాత్రి పదకొండు గంటల సమయంలో మరో వ్యక్తి సాయంతో ఇంటికి చేరుకున్నట్లు తెలిసింది. ఆ సమయంలో ఆమె భర్త నాగరాజు తన తండ్రి కోటేశ్వరరావుకు ఆరోగ్యం బాలేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లి అక్కడే ఉన్నాడు. ఆమె అత్త కూడా ఇద్దరు పిల్లలతో కలిసి వేరే గదిలో నిద్రపోయారు. అయితే అత్త ఉదయాన్నే నిద్ర లేచి చూసే సరికి శ్రావణి రక్తపు మడుగులో శవమై పడి ఉంది.
ముమ్మర దర్యాప్తు..
సమాచారం అందుకున్న మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, రెడ్డిగూడెం ఎస్ఐ శ్రీను సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడి కోసం ఎనిమిది బృందాలుగా ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. అయితే ఇప్పటికే అనుమానితుడైన ఓ వ్యక్తిని పోలీసు లు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
గుణదల(విజయవాడ తూర్పు): బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిపై మాచవరం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచవరం కార్మికనగర్కు చెందిన ఇద్దరు బాలికలు(8) స్నేహితులు. ఈ నెల 26వ తేదీన ఇరువురూ ఆడుకుంటున్నారు. ఈ సమయంలో ఆ ఇంటి పక్కన అద్దెకు ఉంటూ.. తాపి పని చేసుకుని జీవనం సాగించే ఎం. రామకృష్ణ(26) మద్యం తాగి ఈ ఇద్దరు బాలికలను తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలికలు తమ తలిదండ్రులకు చెప్పడంతో.. నిలదీసేందుకు వచ్చిన సమయానికే ఆ నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. రెండు రోజుల తరువాత తిరిగి వచ్చిన అతడు మరలా బాలికలపై వేధింపులకు పాల్పడ్డాడు. విషయం స్థానిక పెద్దలకు తెలిసేలోపే మరలా పరారయ్యాడు. తరచూ మైనర్ బాలికలను వేధిస్తున్న కారణంగా తమ బిడ్డలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఇరువురి బాలికల్లో ఓ బాలిక తల్లి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


