
జాతీయ రహదారిపై వాహనాల బీభత్సం
పెనమలూరు:విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి బందరు రోడ్డుపై గంగూరు సెంటర్లో గురువారం లారీ–కారు బీభత్సం సృష్టించాయి. దీంతో స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీశారు. గంగూరు సెంటర్లో ఉదయం క్వారీ డస్టు లోడ్తో విజయవాడ నుంచి కంకిపాడు వైపునకు వెళుతున్న లారీని గంగూరు సెంటర్ వద్ద వెనుక నుంచి వచ్చిన కారు ఓవర్ టేక్ చేసింది. ఈ లోగా కారుకు మరో వాహనం ఎదురుగా అడ్డు రావటంతో కారు ఒక్కసారిగి లారీ ముందుకు వచ్చి తగిలింది. దీంతో లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయటంతో లారీ అదుపు తప్పి ఒక్కసారిగా రోడ్డుపైనే పల్టీ కొట్టింది. లారీలో ఉన్న డస్టు రోడ్డు పై పడింది. కారు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కింది. అయితే ప్రమాద స్థలంలో ఆ సమయంలో ఎవ్వరూ లేక పోవటంతో ప్రాణ నష్టం జరగలేదు. లారీ ఒక్కసారిగా రోడ్డు పై పల్టీ కొట్టడంతో గంగూరు సెంటర్లో ఉన్న జనాలు తీవ్ర ఆందోళన చెందారు. డివైడర్ మధ్యలో ఉన సిగ్నెల్ లైట్లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలం వద్దకు పోలీసులు చేరుకోని క్రేన్తో రోడ్డు పై పడిన వాహనాలను తొలగించారు.