
యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
నిమ్మకూరు(పామర్రు): యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం సాధించవచ్చని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం. ఫణి ధూర్జటి తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం కల్యాణ మండపంలో గురువారం గురుకుల పాఠశాల, కళాశాల, జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు యోగ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో శారీరక రుగ్మతలు దూరం అవుతాయని చెప్పారు. ప్రతి రోజూ వ్యాయామం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని తెలిపారు. యోగ గురువు ముదిగొండ శాస్త్రి ఆధ్వర్యంలో స్వల్ప, సులభతర, వ్యాయామం, భ్రమర కపాలభాతి, భస్త్రికా ప్రాణాయామం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సహకారంతో నిర్వహించిన ఈ యోగ శిక్షణలో విద్యార్థులు సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం ప్రముఖులను ఎస్వైఎల్ఎన్ ఆచార్యులు, టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా కన్వీనర్ తురగా ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ధర్మ ప్రచార పరిషత్ కన్వీనర్ తాండవ శిక్షణ, అన్నదాన కమిటీ సభ్యులు ఎ. నెలబాలుడులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కె.జ్యోతి, ఎంఈఓ – 2 గుమ్మడి పద్మవాణి, పాఠశాల హెచ్ఎం ఎం.లక్ష్మీలత, గ్రామసర్పంచ్ పి. దుర్గా శ్రీనివాసరావు, బీజేపీ మండల అధ్యక్షుడు ఎం.శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఫణి ధూర్జటి