
జిల్లాలోని 4,470 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు
చిలకలపూడి(మచిలీపట్నం):అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో 4,470 ప్రదేశాల్లో ఈ నెల 21వ తేదీన యోగా కార్యక్రమాలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి జిల్లా, క్షేత్రస్థాయి అధికారులతో గురువారం జూమ్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సచివాలయ పరిధిలో యోగా కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపారు. పేర్లు నమోదు చేసుకున్న పౌరులందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాడిగడప, ఉయ్యూరు మునిసిపాల్టీల్లో, బంటుమిల్లి, మొవ్వ, నాగాయలంక మండలాల్లో శిక్షణా తరగతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని ఉయ్యూరులోని విశ్వశాంతి విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహిస్తామని అక్కడ అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని కోరారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కూడా అదే రోజు నిర్వహించాల్సి ఉన్నందున యోగా కార్యక్రమం పూర్తయిన తరువాత పరిసరాలను శుభ్రం చేయాలని చెప్పారు. మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేయించాలన్నారు. జేసీ గీతాంజలిశర్మ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛాంధ్ర పై యోగా, చిత్రలేఖనం పోటీలను నిర్వహించాలన్నారు. జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్, డీఈవో పీవీజె రామారావు, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా సమన్వయకర్త రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.