
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
పెనమలూరు: తాడిగడప గ్రామంలో వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం తాడిగడప గ్రామం మహాగణపతినగర్కు చెందిన ఉత్తరవల్లి రాజేశ్వరి, భర్త శంకరరావు(36) ఇద్దరు కుమారులతో నివాసం ఉంటున్నారు. రాజేశ్వరి రెస్టారెంట్లో పని చేస్తుండగా భర్త శంకరరావు విద్యుత్ పనులు చేస్తారు. వీరు ఇటీవల ఇల్లు నిర్మించుకున్న సమమంలో రూ.20 లక్షలు అప్పు చేశారు. అప్పుల భారం అధికం కావటంతో శంకరరావు ఆందోళన చెందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం భార్య డ్యూటీకి వెళ్లిన సమయంలో శంకరరావు బెడ్ రూమ్లో ఫ్యాన్కు చీరతో ఉరేసుకున్నాడు. రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్షాపు రోడ్డులోని సిమెంట్ వర్క్స్ కంపెనీ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వయసు 35 ఏళ్ల లోపు ఉంటాయని, ఎత్తు 5.4 అడుగులు, బ్లూ కలర్ ప్యాంటు, రెడ్ కలర్ బన్నీ, మెడలో తాయత్తు కలిగి ఉన్నాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు 94406 27084, 90591 21109, 0866–2882333 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సెక్టార్ ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు.
బైక్ ఢీ కొని వ్యక్తి మృతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బైక్ యూ టర్న్ తీసుకుంటుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సూరాయపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూరాయపాలేనికి చెందిన తంగెళ్లమూడి శ్రీనివాసరవికుమార్(51) గొల్లపూడిలోని హోల్సేల్ మార్కెట్లో ముఠా పని చేస్తుంటాడు. సోమవారం ఉదయం చేపలు తేవడానికి ద్విచక్ర వాహనంపై తుమ్మలపాలెం వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తూ ముత్తవరపు వెంకటేశ్వరరావు గెస్ట్హౌస్ వద్ద యూ టర్న్ తీసుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన భైక్ ఢీ కొట్టింది. దీంతో శ్రీనివాసరవికుమార్కు తలకు గాయమైంది. స్థానికులు అతనిని గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి భార్య ఆదిలక్ష్మి ఇచ్చిన పిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.