ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకొని విద్యుత్ శాఖ, అటవీ శాఖ ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అటవీశాఖ అధికారి బాలామణి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయ ఆవరణలో విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తం జాడె, కాగజ్నగర్ ఎఫ్డీవో భార్గవ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో వేరువేరు అటవీ ప్రాంతాల్లో అనుమతులు లేని విద్యుత్ వైర్లు ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు. వీటికి సంబంధించి అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తం జాడె మాట్లాడుతూ జిల్లాలో అటవీ ప్రాంతం నుండి వెళ్లే విద్యుత్ వైర్లకు ప్రత్యేక తొడుగులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రెండు శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లేలా తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. సమావేశంలో జిల్లాలోని 11 రేంజ్ కార్యాలయాల అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.


