పునఃప్రారంభమైన పాఠశాలలు విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికిన ఉపాధ్యాయులు సర్కార్ స్కూళ్లలో తొలిరోజు హాజరు అంతంతే..
ఆసిఫాబాద్రూరల్: సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బడులను వెల్కం బోర్డులు, బెలూన్లు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. చాలాచోట్ల పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. అమావాస్య, బంధువుల ఇంటికి వెళ్లిన చిన్నారులు రాకపోవడం, తదితర కారణాలతో తొలిరోజు ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు అంతంతే నమోదైంది. జిల్లాలో మొత్తం 772 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 32,427 మంది విద్యార్థులకు కేవలం 6,167 మంది హాజరు కాగా, 26,260 మంది గైర్హాజరయ్యారు. కాగజ్నగర్, సిర్పూర్(టి), దహెగాం, కెరమెరి, తిర్యాణి మండలాల్లో 20 శాతం నుంచి 30శాతం హాజరు నమోదైంది. మిగిలిన మండలాల్లో 20శాతం మంది కూడా పాఠశాలలకు రాకపోవడం గమనార్హం. ఆసిఫాబాద్ మండలం బూర్గుడలోని పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులు బడికి రాగా, ఐదుగురు ఉపాధ్యాయులు హాజరయ్యారు. రోజులు గడిచే కొద్దీ హాజరు పెరుగుతుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు.


