ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 15న పునఃప్రారంభం కానున్నాయి. అయితే కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పాత సమస్యలే స్వాగతం పలకనున్నాయి. జిల్లాలోని చాలా బడుల్లో ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీలు, వంట గదుల నిర్మాణాలు పూర్తికాలేదు. పాత మరుగుదొడ్లు, తరగతి గదులు, వంటశాలలకు మరమ్మతులూ చేపట్టలేదు. సోమవారం బడులకు వచ్చే విద్యార్థులకు ఇక్కట్లు ఎదురుకానున్నాయి. ప్రహరీలు సైతం లేకపోవడంతో పిల్లల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. గురువారం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
పూర్తికాని మరుగుదొడ్లు
జిల్లాలో 738 ప్రభుత్వ పాఠశాలు(స్థానిక సంస్థలు) ఉండగా, 2,072 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సుమారు 39 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గిరిజన ప్రాథమిక పాఠశాలలు 334, ఆశ్రమ ఉన్నత పాఠశాలలు 46 ఉండగా, 13,126 మంది ఉన్నారు. ఆయా పాఠశాలల భవనాలు చాలాచోట్ల శిథిలావస్థకు చేరాయి. అదనపు తరగతి గదుల అసంపూర్తిగా ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత కీలకమైన మరుగుదొడ్ల పనులు కూడా పూర్తి చేయలేదు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 459 పాఠశాలల్లో అదనంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మా ణానికి నిధులు మంజూరు కాగా, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు 218 పూర్తి కాగా మరో 241 నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇందులో సీఎస్ఆర్ నిధులతో పాఠశాలల్లో బాలికలకు 25, బాలురకు 157 టాయిలెట్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కోదానికి రూ.58 వేల చొప్పున నిధులు విడుదలయ్యాయి. ఈ పనుల్లో కొన్ని పూర్తి కాగా మరికొన్ని ప్రారంభమే కాలేదు. ఉపాధిహామీ పథకం కింద రెండు దశల్లో 277 పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మాణం కోసం రూ.2 లక్షల చొప్పున కేటాయించారు. స్థలం లేని 13 పాఠశాలలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్ల నిర్మాణం చేపట్టారు.
కనీస వసతులు కరువు
మరమ్మతులు లేక..
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ప్రస్తుతం మరుగుదొడ్ల నిర్మాణ పనులు 60 శాతం పూర్తికాగా, మిగితా పనులు కొనసాగుతున్నాయి. పిల్లలు ఎక్కవగా ఉన్న పాఠశాలల్లో అదనంగా నిర్మిస్తాం. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం.
– సచ్చిదానంద చారి, డీఈవో


