అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం
కాగజ్నగర్రూరల్: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని కలెక్టర్ కె.హరిత అన్నారు. పట్టణంలోని మైనార్టీ సంక్షేమ పాఠశాలలో ఆసిఫాబాద్, కెరమెరి, తిర్యాణి మండలాల నూతన సర్పంచులకు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి గురువారం హాజరై మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా ప్రథమ పౌరుడిగా సర్పంచులు కృషి చేయాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, ఇంటి పన్నుల వసూలు అంశాలను పర్యవేక్షించాలన్నారు. అనంతరం ప్రభుత్వం డిగ్రీ కళాశాలను పరిశీలించి అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. వేసవిలో పనులు పూర్తి చేసి వచ్చే విద్యాసంవత్సరానికి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీపీవో భిక్షపతి, డీఎల్పీవోలు ఉమర్ హుస్సేన్, హరిప్రసాద్, రిసోర్స్పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కలెక్టర్ కె.హరిత
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
ఆసిఫాబాద్: వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం వేసవి తాగునీటి సరఫరాపై మిషన్ భగీరథ, గ్రామీణ నీటి పారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సిర్పూర్– యు, లింగాపూర్, తిర్యాణి మండలాల్లోని మారుమూల గిరిజన గ్రామాలకు నీటిని సక్రమంగా అందించేందుకు పైప్లైన్లు, పంప్ హౌజ్లకు అవసరమైన మరమ్మతులు నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కెరమెరి మండలం ధనోరా వద్ద డబ్ల్యూపీటీ పాయింట్ నిర్మాణ పనులను ఏప్రిలోగా పూర్తి చేయాలన్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో ప్రతీ ఇంటికి నీరందించేలా ఓవర్హెడ్ ట్యాంకులు, చేతి పంపులు, బావులను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సమావేశంలో మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ రాకేశ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు.


