ఇక సమరమే..!
ముగిసిన మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణ పర్వం ఆసిఫాబాద్, కాగజ్నగర్ బల్దియాల్లో 224 మంది పోటీ.. రెండు వార్డుల్లో పోటీకి దూరంగా కాంగ్రెస్ అన్నిచోట్లా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న బీఆర్ఎస్ నేటి నుంచి ప్రచారంలో వేగం పెంచనున్న అభ్యర్థులు
ఆసిఫాబాద్/కాగజ్నగర్టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ప్రధాన పార్టీల నాయకులు చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులను పోటీ నుంచి తప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లోని 50 వార్డుల నుంచి 290 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 66 మంది ఉపసంహరించుకున్నారు. మొత్తంగా రెండు బల్దియాల్లో 224 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉపసంహరణ పర్వం ముగియడంతో అభ్యర్థులు సమరానికి సిద్ధమవుతున్నారు. బుధవారం నుంచి ప్రచారంలో వేగం పెంచనున్నారు.
ఆసిఫాబాద్లో 94 మంది..
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 120 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, 26 మంది ఉపసంహరించుకున్నారు. 94 మంది బరిలో ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 19 మంది, బీఆర్ఎస్ 20 మంది, బీజేపీ 18, జనసేన 08, బీఎస్పీ ముగ్గురు, సీపీఐ ముగ్గురు, సీపీఎం ఒకరు, 22 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. 19వ వార్డులో కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉంది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నారు. మొత్తంగా ఒక్కో వార్డులో సగటున నలుగురు, ఐదుగురు పోటీ పడుతున్నారు. అత్యధికంగా 11వ వార్డులో ఎనిమిది మంది బరిలో ఉండగా, వార్డు 3, 4, 12, 19లో అత్యల్పంగా ముగ్గురి మధ్యే పోటీ ఉంది. 08, 14 వార్డుల్లో ఏడుగురు, 09, 18 వార్డుల్లో ఆరుగురు, 1, 10, 13, 15, 21 వార్డుల్లో ఐదుగురు, 2, 5, 6, 7, 16, 17 వార్డుల్లో నలుగురు చొప్పున పోటీ పడుతున్నారు.
కాగజ్నగర్లో 130 మంది
కాగజ్నగర్ మున్సిపాలిటీలోని 30 వార్డులకు మొత్తం 170 మంది 230 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 40 మంది పోటీ నుంచి తప్పుకోగా, 130 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చివరి రోజు 34 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఆయా పార్టీల అభ్యర్థుల తుది జాబితాను బల్దియా అధికారులు మంగళవారం విడుదల చేశారు. వార్డు నంబర్ 10లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు బరిలో నిలవగా, కాంగ్రెస్ అభ్యర్థి లేకపోవడంతో ఆ పార్టీ పోటీ నుంచి తప్పుకుంది. అధికార పార్టీ ఉంచి అభ్యర్థిని మున్సిపల్ బరిలో నిలుపకపోవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్ మినహా ఇతర పార్టీల నుంచి కూడా ఇక్కడ అభ్యర్థులు పోటీలో లేరు. అతి తక్కువ మంది పోటీపడుతున్న వార్డుగా పదో వార్డు నిలిచింది. అలాగే వార్డు 11, 14, 17, 21, 26, 29లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. వార్డు నం.4, 7, 25, 27 వార్డుల్లో అత్యధిక మంది పార్టీ అభ్యర్థులతోపాటు స్వతంత్రులు బరిలో నిలిచారు.
వారమే గడువు
బరిలో ఉన్న అభ్యర్థులు తేలడంతో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. పోలింగ్కు కేవలం వారం రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం అభివృద్ధి పనులపై హామీలు గుప్పిస్తున్నాయి. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి.
పార్టీల వారీగా అభ్యర్థుల వివరాలు
మున్సిపాలిటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బీఎస్పీ జనసేన సీపీఐ/సీపీఎం ఎంఐఎం స్వతంత్రులు/ఇతర పార్టీలు
ఆసిఫాబాద్ 19 20 18 3 8 4 0 22
కాగజ్నగర్ 20 30 30 8 2 2 3 26
ఇక సమరమే..!


