
అప్పీల్ వ్యవస్థ చాలా కీలకం
కెరమెరి(ఆసిఫాబాద్): భూభారతి చట్టంలో అప్పీల్ వ్యవస్థ చాలా కీలకమైందని, రైతులకు ఈ చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని కెస్లాగూడ రైతువేదికలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి రైతులకు అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతుల భూసమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. రైతులకు అన్యాయం జరిగితే కలెక్టర్, ఆర్డీవో, సీసీఎల్ స్థాయిలో అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన వారిని గ్రామ అధికారి, సర్వేయర్లుగా నియమిస్తామని అన్నారు.
రైతులకు న్యాయం చేస్తాం
అనంతరం ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా రైతులకు న్యాయం చేస్తామని అన్నారు. ధరణి పోర్టల్తో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగేవని, ఇప్పుడు అలాంటి సమస్యలు ఉండవన్నారు. సాదాబైనామాల ప్రకారం కొనుగోలు చేసిన భూములకు సైతం పరిష్కారం లభిస్తుందన్నారు. చట్టంలోని అంశాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, తహసీల్దార్ దత్తుప్రసాద్, ఎంపీడీవో అంజద్పాషా, కాంగ్రెస్ ఆసిఫాబాద్ నియోకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, రైతులు పాల్గొన్నారు.
ప్రతీ రైతుకు భూభారతి చట్టంపై అవగాహన ఉండాలి
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే