
సర్కారు చదువు.. సివిల్స్లో ర్యాంకు
● సత్తా చాటిన రాంటెంకి సుధాకర్
కౌటాల(సిర్పూర్): యూపీఎస్సీ– 2024 సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో కౌటాల మండలం బోదంపల్లి గ్రామానికి చెందిన రాంటెంకి సుధాకర్ ఆలిండియా స్థాయిలో 949 ర్యాంకు సాధించారు. నిరుపేద కు టుంబానికి చెందిన రాంటెంకి సోమయ్య, ప్రమీల దంపతులకు ముగ్గురు సంతానం. రెండో కుమారుడు సుధాకర్ విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో సాగింది. బోదంపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు, ఆ తర్వాత పదో తరగతి వరకు సిర్పూర్(టి)లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో పూర్తి చేశా రు. నాగోల్లోని గురుకుల కళాశాలలో ఇంటర్మీడియెట్ విద్యనభ్యసించారు. అనంతరం ఖరగ్పూర్ ఐఐటీలో మెకానిక్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. మొదటి నుంచే సివిల్స్లో సత్తా చాటాలనే పట్టుదలతో హైదరాబాద్లోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ప్రత్యేక శిక్షణ పొందాడు. యూపీఎస్సీ పరీక్షల్లో మూడుసార్లు ప్రయత్నించి విఫ లం కాగా, నాలుగో ప్రయత్నంలో 949 ర్యాంకు సాధించాడు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదివిన మారుమూల ప్రాంతానికి చెందిన సుధాకర్ సివిల్స్ ర్యాంక్ సాధించడంపై బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ట్విటర్లో అభినందించారు. సుధాకర్ సివిల్స్లో సత్తా చాటడంతో మంగళవారం బోదంపల్లిలో సందడి నెలకొంది. స్థానికులు సుధాకర్ కుటుంబ సభ్యులను అభినందించారు. సోషల్ మీడియాలో శుభాంకాంక్షలు వెల్లువెత్తాయి.