
‘సర్కార్’లోనూ ప్రీ ప్రైమరీ
● ఇప్పటికే 11 స్కూళ్లలో అమలు ● వచ్చే ఏడాది మరిన్ని బడుల్లోనూ.. ● ‘ప్రైవేట్’కు దీటుగా విద్యాబోధన
దహెగాం: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం సర్కార్ బడులను తీర్చిదిద్దుతోంది. ‘ప్రైవేట్’ లో మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ ప్రైమ రీ ఎడ్యుకేషన్ (పూర్వ ప్రాథమిక విద్య) విధానాన్ని అమలు చేస్తోంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీనీ కొనసాగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆటాపాటలతో విద్యను బోధిస్తున్నట్లే ప్రభుత్వ పాఠశాలల్లోనూ చదువు నేర్పించనున్నా రు. రెండేళ్లుగా పూర్వ ప్రాథమిక విద్యను జిల్లాలోని 11 ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మరిన్ని పాఠశాలల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు కసరత్తు చేస్తోంది.
సంఖ్యకు తగినట్లు నిధులు
పూర్వ ప్రాథమిక విద్య అమలు చేస్తున్న పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. 10 నెలలకు గాను ఒక్కో పాఠశాలకు సుమారు రూ.1.70 లక్షలు ఇస్తోంది. విద్యార్థులకు బోఽధించడానికి ఇన్స్ట్రక్టర్కు నెలకు రూ.8వేలు, ఆయాకు రూ.6వేలు చెల్లిస్తోంది. చిన్నారులు ఆడుకోవడానికి ఆట వస్తువుల కోసం సంవత్సరానికి రూ.20వేలు, ఆరోగ్యం, పరిశుభ్రత అవసరాలకు రూ.10వేలు, బోధన అభ్యసన సామగ్రి కోసం ఒక్కో విద్యార్థికి రూ.500 వెచ్చిస్తోంది. విద్యార్థులకు ఆట బొమ్మలతో అక్షరాలు, అంకెలు గుర్తు పట్టేలా ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య, అక్షరాస్యత సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
మరిన్ని పాఠశాలల్లోనూ..!
ఇప్పటికే జిల్లాలోని 11 ప్రాథమిక పాఠశాల్లో పూర్వ ప్రాథమిక విద్య కొనసాగుతుండగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి మరిన్ని పాఠశాలల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాలల వివరాలు యూడైస్లో ఎంట్రీ చేస్తున్నందున దాని ఆధారంగా వచ్చే విద్యాసంవత్సరం జిల్లాలో సుమారు 20 నుంచి 25 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. కాగా, ఇందుకు జిల్లా నుంచి ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. నిరుపేద కుటుంబాల పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపే స్థోమత లేనందున ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య అమలు చేస్తే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం పూర్వ ప్రాథమిక విద్య సత్ఫలితాలనిస్తోందని విద్యావేత్తలు చెబుతున్నారు.
చిన్ననాటి నుంచే రాణించేలా..
2020 నూతన విద్యావిధానంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకువస్తోంది. పూర్వ ప్రాథమిక విద్య ఉద్దేశం, విద్యార్థులు విద్యలో చిన్ననాటి నుంచే రాణించేలా కసరత్తు చేస్తోంది. అక్షరాలు, అంకెలను గుర్తించేలా తయారు చేయడం, ప్రీ ప్రైమరీ విద్యను సార్వత్రీకరించడం, మూడేళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని పాఠశాలల్లోనూ..
జిల్లాలోని 11 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య అమలవుతోంది. ఈ విధానం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయి. విద్యార్థులు పాఠశాలకు రావడానికి అలవాటు పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల్లాగే ఈ పాఠశాలలకు వస్తున్న పిల్లలకు ఆట బొమ్మలతో అక్షరాలు, అంకెలను గుర్తించడం నేర్పిస్తున్నారు. యూడైస్ ఆధారంగా వచ్చే విద్యాసంవత్సరం జిల్లాలో మరో 20 నుంచి 25 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విధానం అమలయ్యే అవకాశముంది.
– యాదయ్య, ఇన్చార్జి డీఈవో
‘ప్రీ ప్రైమరీ’ అమలయ్యే పాఠశాలల వివరాలు
మండలం గ్రామాలు
దహెగాం హత్తిని, ఇట్యాల, కుంచవెల్లి
బెజ్జూర్ బెజ్జూర్, కుకుడ, సల్గుపల్లి, పాపన్పేట్
కాగజ్నగర్ చింతగూడ, కాగజ్నగర్లోని 14వ వార్డు యూపీఎస్
వాంకిడి కిరిడి
కెరమెరి సావర్ఖేడ