పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

పరీక్షలు

Apr 18 2025 1:42 AM | Updated on Apr 18 2025 1:42 AM

పరీక్షలు

పరీక్షలు

కంటి‘పాప’లకు
● చిన్నారుల్లో నేత్ర, మానసిక సమస్యలు గుర్తింపు ● ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు ● జిల్లాలో 973 అంగన్‌వాడీ కేంద్రాలు ● జూన్‌ వరకు కొనసాగనున్న ప్రక్రియ

కనర్‌గాంలోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులను పరీక్షిస్తున్న ఆర్‌బీఎస్‌కే సిబ్బంది

ప్రతిరోజూ 150 మందికి..

చిన్నారుల్లో కంటి, మానసిక రుగ్మతలు నిర్మూలించేందుకు 100 రోజులపాటు జిల్లావ్యాప్తంగా మూడు బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఒక్కొక్క బృందంలో ఇద్దరు డాక్టర్లు, ఒక ఫార్మసిస్ట్‌, ఒక ఏఎన్‌ఎం, ఒక అప్తోమెట్రిస్ట్‌ ఉంటారు. ఒక్కొక్క బృందంలోని సభ్యులు ప్రతిరోజూ అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. ఒక్కరోజులో 150 మంది పిల్లలను పరీక్షిస్తారు. జిల్లాలో 973 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 41,782 మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించా రు. రోజుకు 150 మంది చొప్పున వందరోజుల్లో పరీక్షలు పూర్తి చేయనున్నారు. అయితే ఆర్‌బీఎస్‌కే బృందాలు పది ఉన్నా అప్తోమెట్రిస్ట్‌లు తక్కువగా ఉండటంతో జి ల్లాలో మూడు బృందాలు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు నెలల్లో లక్ష్యం పూర్తి కావడం కష్టంగా మారింది. కంటి పరీక్షలు చేసే నిపుణులను నియమించుకుంటే గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

వాంకిడి(ఆసిఫాబాద్‌): ప్రాథమిక దశలోనే కంటి, మానసిక సమస్యలు గుర్తించి చికిత్స అందించేందుకు ఈ నెల 7 నుంచి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే) ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు వైద్యారోగ్య శాఖ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. మొదటి విడతలో ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుకునే విద్యార్థులకు, రెండో విడతలో 5, 6, 7 తరగతుల విద్యార్థులకు రక్తహీనతపై స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందుల అందించి చికిత్స చేయించారు. మూడో విడతలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకునే ఆరేళ్లలోపు పిల్లల్లో మానసిక, కంటి సమస్యలను గుర్తించి తక్షణ చికిత్స అందించేలా కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 7న ప్రారంభమైన కార్యక్రమం జూన్‌ వరకు వందరోజులపాటు కొనసాగనుంది.

సమస్యలు గుర్తించేందుకు 42 ప్రశ్నలు..

జీవన విధానంలో వస్తున్న మార్పులు, ఆహారపు అలవాట్లుతో బాల్యంలోనే పిల్లలకు అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. చిన్న పిల్లల్లో కంటి, మానసిక సమస్యలను గుర్తించడానికి అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. త్వరగా అర్థం చేసుకుని సమాధానం చెప్పేలా మొత్తం 42 సులువైన ప్రశ్నలు రూపొందించారు. ముందస్తుగా అంగన్‌వాడీ టీచర్లు పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందిస్తారు. పిల్లలను తల్లిదండ్రులతోపాటు కూర్చోబెట్టి బొమ్మలతో కూడిన చిత్రాలను చూపిస్తూ ప్రశ్నలు అడుగుతారు. ఆ సమయంలో పిల్లల నుంచి వచ్చే సమాధానాలకు అనుగుణంగా సమస్యను గుర్తిస్తారు. పిల్లల్లో ఎదుగుదల లోపాలు, జన్యుపరమైన సమస్యలతోపాటు కంటిలో వచ్చే కార్నియా, మెల్లకన్ను, తదితర సమస్యలు గుర్తిసా రు. ఆ తర్వాత మందల పంపిణీ చేయడం లేదా ఆస్పత్రిలో చేర్పించేందుకు చర్యలు చేపడతారు. కంటి సమస్య ఎక్కువగా ఉంటే అద్దాలు అందజేస్తారు. శస్త్ర చికిత్స కూడా చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 7 నుంచి ఇప్పటివరకు వరకు సుమారుగా 2,500 మందికిపైగా పిల్లలను పరీక్షించారు. ఇందులో దృష్టిలోపం ఉన్న వారు ముగ్గురు, ఇతర నేత్ర సంబంధ ఇబ్బందులు 13 మందికి ఉన్నట్లు గుర్తించారు. వారందరికీ ఉచితంగా చికిత్స చేయించి కళ్లద్దాలు అందజేయనున్నారు.

అన్ని కేంద్రాల్లో పరీక్షలు

జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లల్లో కంటి, మానసిక సమస్యలు గుర్తించేలా కార్యాచరణ రూపొందించాం. వాంకిడి, ఆసిఫాబాద్‌, రెబ్బెన, కాగజ్‌నగర్‌ మండలాల్లో ఆర్‌బీఎస్‌కే ప్రత్యేక బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. సమస్యలు ఉన్న పిల్లలకు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తాం. అలాగే అవసరమైన వారికి కళ్లద్దాల పంపిణీ చేస్తాం. ప్రభుత్వం ఉచితంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– సీతారాం, డీఎంహెచ్‌వో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement