
● 12 నుంచి మూడు రోజులపాటు జాతర మహోత్సవం ● మొదటిరోజు శివ
రెబ్బెన(ఆసిఫాబాద్): రెబ్బెన మండలం ఇందిరానగర్లో స్వయంభూగా వెలిసిన మహంకాళి ఆలయంలో ఈ నెల 12 నుంచి మూడు రోజులపాటు అమ్మవారి జాతర మహోత్సవం జరగనుంది. అమ్మవారి పుట్టినరోజు చైత్రపౌర్ణమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఏటా చైత్రపౌర్ణమి సందర్భంగా ఆలయంలో జాతర మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మొదటిరోజు శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తుండగా, రెండోరోజు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. అదేరోజు సాయంత్రం అమ్మవారి రథోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆ రోజు రాత్రి ఆలయం వద్ద బస చేసి.. మూడోరోజు అమ్మవారికి కోళ్లు, మేకలను బలి ఇచ్చి వన భోజనాలు చేస్తారు.
ప్రత్యేక ఆకర్షణగా భూగర్భంలో అమ్మవారి విగ్రహం
ఆలయంలో అమ్మవారి విగ్రహం చూసేందుకు రెండు కళ్లు సరిపోవు అన్నట్లు ఉంటుంది. ఆలయం వెనుక భాగంలో భూగర్భంలోని గుహలో కొలువుదీరిన మహంకాళి అమ్మవారి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మహారాష్ట్రలోని చంద్రపూర్(చాందా) మహంకాళి ఆలయంలో మాదిరి గానే ప్రధాన ఆలయం వెనుక భాగంలో పది ఫీట్ల లోతులో భూగర్భంలో గుహ ఏర్పాటు చేసి, అందులో పడుకుని ఉన్నట్లు అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో 21 ఫీట్ల ఎత్తుతో ఏర్పాటు చేసిన మహంకాళి విగ్రహం, 15 ఫీట్ల నాగదేవత విగ్రహాలు, శనేశ్వరుడి ఆలయం, కాలభైరవుడు, అరుణాచల శివుడి ఆలయాలు ఉన్నాయి.
వైభవంగా అమ్మవారి జాతర
2015లో చిన్నఆలయంలో అమ్మవారిని ప్రతిష్టించగా భక్తులు, గ్రామ ప్రజల సహకారంతో ఆలయం అభివృద్ది చెందుతోంది. చైత్రపౌర్ణమి రోజు అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. అమ్మవారి పల్లకి సేవ, భజన కార్యక్రమాలు కొనసాగుతాయి.
– దేవార వినోద్, ఆలయ ప్రధాన అర్చకుడు
ఏర్పాట్లు చేస్తున్నాం
జాతరకు తరలివచ్చే భక్తుల కు ఇబ్బందులు తలెత్తకుండా అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నాం. మూడు రోజలు ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తాం. చంద్రపూర్ తర్వాత ఈ ప్రాంతంలో స్వయంభూగా మహంకాళి అమ్మవారు కొలువుదీరిన ఏకై క ఆలయం ఇదే.
– మోడెం తిరుపతిగౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు
స్వయంభూగా వెలిసిన తీరు
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో రెబ్బెనలో అటవీప్రాంతం అధికంగా ఉండేది. పెద్దపులులు, ఇతర వన్యమృగాలు సంచరిస్తుండేవి. స్థానికులు అడవిలోకి రాకపోకలు సాగించే సమయంలో వన్యప్రాణుల నుంచి కాపాడాలని మహంకాళి అమ్మవారికి మొక్కుకునేవారు. అమ్మ దయ ఉంటే ఎలాంటి హాని కలగదని వారి నమ్మకం. చంద్రపూర్లో మహంకాళి అమ్మవారు కొలువై ఉండగా.. అదే మాదిరిగా ఇందిరానగర్లో భక్తులు గోధుమ పిండి దీపం, బెల్లంపూర్ణ, తియ్యనిపాను, మేకలు, కోళ్లు బలి ఇచ్చి పూజలు చేసేవారు. కొన్నేళ్లకు అతివృష్టి కారణంగా అమ్మవారి విగ్రహం నీటిలో మునిగిపోయింది. అదే స్థలంలోనే పుట్ట ఏర్పడింది. చైత్రమాసం పౌర్ణమి సమయానికి పుట్ట సంపూర్ణ ఆకారంలో భక్తులకు కనిపించగా అక్కడే పూజలు చేసేవారు. కాగజ్నగర్ మండలం బారెగూడ గ్రామానికి చెందిన మోర్లె నారాయణ, లక్ష్మి దంపతుల కుమారు వినోద్ చిన్నతనం నుంచే అమ్మవారి భక్తుడు. 2014 సమయంలో రెబ్బెన మండలం ఉంటున్న తన మేనత్త ఇంట్లో ఉండి చదువుకునేవాడు. ఓ రోజు రాత్రి వినోద్కు పామురూపంలో అమ్మవారు కలలో కనిపించి ఇందిరానగర్లో పుట్టలో ఉన్న తనను బయటకు తీసి పూజలు చేయమని చెప్పారట. మరుసటి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది బిందెల చొప్పున పుట్టపై నీళ్లు పోయగా చైత్రపౌర్ణమి తర్వాత అమ్మవారి శిలావిగ్రహం బయటపడినట్లు భక్తులు చెబుతుంటారు. అప్పటి నుంచి గ్రామస్తులు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2015లో వినోద్ అమ్మవారికి ఆలయాన్ని నిర్మించి మహంకాళి అమ్మవారితో పాటు కనకదుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

● 12 నుంచి మూడు రోజులపాటు జాతర మహోత్సవం ● మొదటిరోజు శివ

● 12 నుంచి మూడు రోజులపాటు జాతర మహోత్సవం ● మొదటిరోజు శివ

● 12 నుంచి మూడు రోజులపాటు జాతర మహోత్సవం ● మొదటిరోజు శివ