ఖమ్మంరూరల్: ఖమ్మంరూరల్ మండలంలోని పొన్నెకల్లు స్టేజీ సమీపాన ఖమ్మం – సూర్యాపేట జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. తల్లంపాడు గ్రామానికి చెందిన షేక్ మోసిన్(17), ఎస్.కే.జహీర్ ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై ఖమ్మం వైపు బయలుదేరారు. పొన్నెకల్లు స్టేజీ సమీపాన వాహనం అదుపు తప్పగా కింద పడిన మోసిన్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, జహీర్కు చేయి విరగడంతో పాటు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
మృతదేహంతో ఆందోళన
బూర్గంపాడు: మండలంలోని సారపాక ఐటీసీ పీఎస్పీడీలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుడు వరికూటి నర్సింహారావు(36) బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. బుధవారం జనరల్ షిఫ్ట్ డ్యూటీలో ఉన్నప్పుడే అస్వస్థతకు గురై పరిశ్రమ నుంచి బయటకు వచ్చిన తర్వాత మృతిచెందాడని బంధువులు, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు మృతదేహంతో ఆందోళన కొనసాగగా.. ఐటీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాల నేతలు, మృతుడి బంధువులు చర్చించారు. దీంతో మృతుడి కుటుంబానికి ఆర్థిక భరోసా, ఉపాధి భరోసా కల్పించేందుకు యాజమాన్యం అంగీకరించడంతో ఆందోళన విరమించారు.


