పెనుబల్లి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్ డీఏలు, బిల్లులు తక్షణమే విడుదల చేయాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు డిమాండ్ చేశారు. పెనుబల్లి మండలంలోని పలు పాఠశాలల్లో గురువారం సంఘ సభ్యత్వ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు విడుదలపై సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి స్పష్టమైన హామీ ఇచ్చినా ఆచరణలో చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఇకనైనా పెండింగ్ బిల్లులు విడుదల చేయనిపక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. అంతేకాక సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకుని, హెల్త్ కార్డుల విధివిధానాలు ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు సురేష్బాబు, మహేష్, రాష్ట్ర, జిల్లా నాయకులు ఆర్.బ్రహ్మారెడ్డి, మురళీరెడ్డి, కొల్లి శ్రీనివాసరావు, పుల్లయ్య, కోటయ్య, జి.అంథోని తదితరులు పాల్గొన్నారు.
పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
రంగారావు


