వేసవి సెలవులన్నీ
అమ్మమ్మ ఇంట్లోనే..
సత్తుపల్లిటౌన్: వేసవి సెలవులు వచ్చాయంటే అందరం కలిసి అమ్మమ్మ ఇంటికి వెళ్లేవాళ్లం. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం దామగట్లలో అమ్మమ్మ ఇంటికి వెళ్లి మేనమామలు, వారి పిల్లలతో సందడిగా గడిపేవాళ్లం. రోజూ సద్ది కట్టుకొని పొలాలకు వెళ్లేవాళ్లం. అంతేకాక వరి కోత పనులు, నాట్లు వేయడం, వేరుశనగ తీయడంలో పాలుపంచుకునేవాళ్లం. రాత్రి వేళ పిల్లలందరం కలిసి అష్టాచెమ్మా, దొంగా పోలీస్, కుంటాట, ఉప్పాట ఆడుకునేది. ఇంకా భక్షాలు (బొబ్బట్లు) చేసేవాళ్లం. మజ్జిగ చిలకడం ఇష్టంగా చేసేదానిని. ఆరో తరగతి చదివేటప్పుడు కడపలో నాలుగైదు కిలోమీటర్లు నడిచి స్కూల్కు వెళ్లాను. ఏడు నుంచి పదో తరగతి వరకు నందికొట్కూరులో ఎన్సీసీ కేడెట్గా స్కూల్ ఫస్ట్ వచ్చా. ఇలా నా బాల్యమంతా ఆటపాటలతో ఆనందంగా గడిచిపోయింది.
– డాక్టర్ మట్టా రాగమయి, సత్తుపల్లి ఎమ్మెల్యే


