అందరి ఆసక్తి! | - | Sakshi
Sakshi News home page

అందరి ఆసక్తి!

Jun 27 2025 4:51 AM | Updated on Jun 27 2025 4:51 AM

అందరి ఆసక్తి!

అందరి ఆసక్తి!

రిజర్వేషన్లపైనే

ఏం జరగనుందో..

గ్రామపంచాయతీల్లో వార్డులు, సర్పంచ్‌ల రిజర్వేషన్ల మార్పుతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల నాటి రిజర్వేషన్లలో కాస్త మార్పు ఉంటుందా.. సమూలంగా మార్పులు వస్తాయా అనే చర్చ సాగుతోంది. బరిలో నిలవాలనుకునే అభ్యర్థులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన నేపథ్యాన రిజర్వేషన్ల అంశంపై చర్చ జోరుగా సాగుతోంది. సర్పంచ్‌ పదవికి బరిలో ఉండాలనుకునే నేతల్లో ఈ ఆందోళన ఎక్కువగా ఉంది. ఎంచుకున్న వార్డు లేదా సర్పంచ్‌ స్థానానికి గెలిచే అవకాశమున్నా ఎవరికి రిజర్వు అవుతుందో తేలకపోవడంతో అది ఖరారయ్యాకే పోటీ చేయడమా కుటుంబీకులను రంగంలోకి దించడమా నిర్ణయించుకోవాలనే భావనలో ఉన్నారు.

వాయిదాలు పడుతూ..

2019 ఏడాదిలో 584 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. ఆ ఏడాది ఫిబ్రవరి 2న పాలక వర్గాలు పగ్గాలు చేపట్టాయి. వీరి పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1న ముగిసింది. దీంతో 16 నెలల నుంచి జీపీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం, ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల కోర్టు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇవ్వడంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి.

రిజర్వేషన్ల చిక్కుముడి

పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిశాక ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా వార్డులు, సర్పంచ్‌ల రిజర్వేషన్ల మార్పుతో సాధ్యం కాలేదు. 2019 ఎన్నికల సందర్భంగా అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామపంచాయతీ చట్టం–2018ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం చేసిన రిజర్వేషన్లు పదేళ్ల పాటు కొనసాగాలి. అంటే ఈసారి కూడా అవే రిజర్వేషన్ల ప్రకారం నిర్వహించాల్సి ఉంది. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించడంతో రిజర్వేషన్లు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకోపక్క జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల ఖరారుపై బీసీ కమిషన్‌ కసరత్తు చేస్తోంది. చట్టసభలో బిల్లు ఆమోదం పొందడంతో రిజర్వేషన్ల మార్పు అనివార్యం కానుండగా.. ఈ ప్రక్రియ ఆలస్యం కారణంగా ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి.

నెలరోజుల్లో తేలనున్న లెక్కలు

కోర్టు తీర్పు నేపథ్యాన వచ్చే నెలరోజుల్లో వార్డులు, సర్పంచ్‌ల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. జిల్లాలో మొత్తం 589 గ్రామపంచాయతీలు ఉండగా.. గత ఎన్నికల్లో 584 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇటీవల ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటిలో విలీనమైన జీపీలు మినహాయిస్తే 571పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో సర్పంచ్‌లు, వార్డు మెంబర్‌ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాక గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కనున్నాయి.

ఆ ఎన్నికలపై కూడా..

కోర్టు తీర్పుతో త్వరలోనే జీపీ ఎన్నికలు జరగనుండగా.. ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సైతం నిర్వహిస్తుందని తెలుస్తోంది. జిల్లాలోని 289 ఎంపీటీసీ స్థానాలకు 2019 మే నెలలో ఎన్నికలు జరగ్గా.. పాలకవర్గాల గడువు తీరిపోయింది. అయితే ప్రస్తుతం ఎంపీటీసీ స్థానాలను పునర్విభజన చేశారు. ఖమ్మంరూరల్‌ మండలంలోని పది గ్రామపంచాయతీలు కొత్తగా ఏదులాపురం మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. మరో రెండు గ్రామపంచాయతీల పరిఽధిలోని కొన్ని గ్రామాలను సైతం కలిపారు. దీంతో అక్కడ రెండు ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. మరోవైపు రఘునాథపాలెం మండలం నుంచి మూడు జీపీలు ఖమ్మం రూరల్‌లో కలవడంతో ఈ మండలానికి ఒక ఎంపీటీసీ స్థానం అదనంగా వచ్చింది. అలాగే, ఎంపీటీసీ స్థానాల పునర్విభజనతో కొత్త స్థానం ఏర్పడింది. అంతేకాక కల్లూరు మున్సిపాలిటీ ఏర్పాటుతో ఐదు ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. ఇవి మినహా మిగిలిన ఎంపీటీసీ స్థానాలతో పాటు 20 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు

గ్రామస్థాయిలో పట్టు నిరూపణకు

ఆశావహుల యత్నం

రిజర్వేషన్ల ఖరారు తర్వాతే

స్థానం తేల్చుకోవాలని భావన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement