
విద్యతోనే పేదరికం దూరం
● జీపీల్లో మంచి వారిని ఎన్నుకుంటేనే గ్రామాల అభివృద్ధి ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రఘునాథపాలెం: చదువే జీవితాలను మారుస్తుందని, పేదరికాన్ని దూరం చేస్తుందనే విషయాన్ని గుర్తించిన తమ ప్రభుత్వం అందరికీ ప్రభుత్వ విద్యను అందుబాటులోకి తీసుకొస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రఘునాథపాలెం మండలంలోని పుఠానితండా, సూర్య తండాల్లో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ ప్రతీ కుటుంబం ముందుచూపుతో ఆలోచించి పిల్లలను చదివించాలని తద్వారా పేదరికం నుంచి బయటపడడమేకాక సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఇందుకోసం అన్ని వసతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని సూచించారు. కాగా, అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, పొలాలకు వెళ్లేందుకు మట్టి రోడ్ల నిర్మాణం చేపడుతుండగా, రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో మంచి నాయకులను ఎన్నుకుంటే ఆయా గ్రామాలు అభివృద్ధి బాట పడతాయని మంత్రి చెప్పారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ గ్రామపంచాయతీ భవనా లను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటూ, ఒక గదిని గ్రంథాలయంగా మార్చుకోవాలని సూచించారు. అనంతరం పుఠానితండా, సూర్యతండా గ్రామాల్లో 19మందికి మంత్రి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఆర్డీఓ నర్సింహారావు, డీపీఓ ఆశాలత, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, డీఎల్పీఓ రాంబాబు, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ అశోక్కుమార్, ఆత్మ, సొసైటీ చైర్మన్లు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, తాతా రఘురాంతో పాటు నాయకులు మానుకొండ రాధాకిషోర్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సాధు రమేష్రెడ్డి, మందడపు తిరుమలరావు, మారెళ్ల లక్ష్మణరావు, వాంకుడోత్ దీపక్, కొంటెముక్కల నాగేశ్వరరావు, మూడు చిన్నా, పీఆర్ డీఈ మహేష్, ఏఈ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
సార్... నేను చదువుకుంటా
చదువుకోవాలనే ఆసక్తి ఉంది సార్, నాకు గురుకులంలో ఇంటర్మీడియట్ సీటు ఇప్పించండి... అంటూ ఓ బాలిక పుఠానీ తండా సమావేశంలో వేదికపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరింది. సదరు గిరిజన విద్యార్థిని ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణత సాధించగా గురుకులంలో ఇంటర్ సీటు కోసం మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో స్పందించిన మంత్రి తుమ్మల చదువుపై ఆసక్తి ఉన్న వారికి అవకాశాలు కల్పించాల్సిన బాద్యత తమపై ఉన్నందున తగిన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు ఇస్తానని బదులిచ్చారు.