
ఆరు గ్యారెంటీల అమలెక్కడ?
● దేశంలో మాయనిమచ్చగా మిగిలిన ఎమర్జెన్సీ ● మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఎన్నికల ముందు అధికారమే పరమావధిగా ఇచ్చిన 66 హామీలు, ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఖమ్మంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ మాయని మచ్చగా మిగిలిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం తప్ప ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు లేవని చెప్పారు. సామాజిక న్యాయంపై మాట్లాడే కాంగ్రెస్.. రాష్ట్రాన్ని 40 ఏళ్లు పాలించినా గిరిజనుడిని ముఖ్యమంత్రిని చేసిందా అన్ని ప్రశ్నించారు. ఇప్పుడు బీసీ, కులగణన అంటున్న కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ఇవన్నీ ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కొట్లాడి, కష్టపడి తెలంగాణను తెచ్చుకుంటే రాష్ట్రాన్ని బాగు చేసే సత్తా అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్కు లేదని తేలిపోయిందన్నారు. అప్పుల ఊబిలో నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే మార్గమని ఈటల తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గపు చర్య
కూసుమంచి: ఫోన్ ట్యాపింగ్ ద్వారా గత ప్రభుత్వం దుర్మార్గపు చర్యకు పాల్పడిందని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు ఈటల రాజేందర్ విమర్శించారు. కూసుమంచిలో నిర్వహించిన సంవిధాన్ హత్యా దివస్(రాజ్యాంగ హత్యా దినోత్సవం)లో పాల్గొన్న ఈటెల ఎమర్జెన్సీ కాలం నాటి ఫొటోలతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ను పరిశీలించాక మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ దుర్మార్గానికి పరాకాష్ట అని... దీంతో ఏమీ సాధించలేకపోగా ప్రజల చేతుల్లో ఓటమి ఎదురైందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణలను ప్రజల శ్రేయస్సు కోసం చేపడితే కాంగ్రెస్ మాత్రం వందసార్లు వారి స్వార్ధం కోసమే రాజ్యాంగాన్ని సవరించిందని విమర్శించారు. ఈ సమావేశాల్లో మాజీ ఎంపీ సీతారాంనాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు తాండ్ర వినోద్రావు, దేవకి వాసుదేవరావు, పుల్లారావుయాదవ్, సన్నె ఉదయ్ప్రతాప్, గెంటేల విద్యాసాగర్, దొంగల సత్యనారాయణ, ఈ.వీ.రమేష్, పుణ్యవతి, నున్నా రవికుమార్, సంతోష్రెడ్డి, విజయారెడ్డి, శీలం పాపారావు, హట్యానాయక్, శ్యాంరాథోడ్, గడ్డం వెంకటేశ్వర్లు, రవిరాథోడ్, మల్లారెడ్డి, దాసరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.