సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ముందస్తుగా వర్షాలు కురిశాయన్న ఆనందం రైతులకు కొద్దిరోజులు కూడా మిగల్లేదు. వ్యవసాయ పనులు ప్రారంభించే సమయానికి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయగా.. వరుణుడి కరుణ కోసం ఆకాశం వైపు ఎదురుచూడడం ఆనవాయితీగా మారింది. గత నెలాఖరులో జిల్లా అంతటా వర్షాలు కురవగా, రైతులు సంతోషంగా దుక్కులు దున్ని సేద్యానికి సిద్ధమయ్యారు. కొన్నిచోట్ల పత్తి విత్తనాలు కూడా నాటినా, ఆతర్వాత అనుకున్న స్థాయిలో వర్షాలు లేక అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఈపాటికే దాదాపు లక్ష ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటాల్సి ఉండగా, ఇది 30,351 ఎకరాలకే పరిమితమైంది. ఇక వరితో పాటు మెట్ట పంటల సాగు కూడా ఆశాజనకంగా నమోదు కాలేదు.
మే చివరిలోనే వర్షాలు..
ఈ ఏడాది మే మూడో వారంలోనే నైరుతి రుతుపవనాల ప్రవేశం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ఆధారంగా రైతులు దుక్కులు దున్నగా.. చాలామంది పత్తి విత్తనాలు విత్తారు. మృగశిర కార్తె ప్రారంభం తర్వాత వర్షాలు జోరందుకోవాల్సి ఉండగా, అడపా దడపా మబ్బులు కమ్మడం తప్ప వర్షం జాడే లేదు. ఇదే పరిస్థితి మరిన్ని రోజులు ఉంటే పత్తి విత్తనాలు భూమిలోనే కలిసిపోయే అవకాశముందనే భయంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు.
అంచనా అందుకునేనా..
గత నెలలోనే వర్షాలు కురిసిన నేపథ్యాన ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత వానాకాలంలో 2లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, ఈసారి 2,20,550 ఎకరాలకు చేరుతుందని భావించారు. ఈమేరకు కొందరు రైతులు విత్తనాలు నాటగా, మరికొందరు సరిపడా వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, వర్షాలు ఆలస్యమవుతుండగా.. అంచనాల మేరకు జిల్లాలో పత్తి సాగవుతుందా, లేదా అన్న మీమాంస నెలకొంది.
మరో రెండు నెలలే..
ఈ వానాకాలం సీజన్ పంటల సాగుకు రెండు నెలల సమయమే ఉంది. ఆగస్టు వరకు వరి నాట్లు వేయడానికి అవకాశముంది. సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుండడంతో రైతులు పంట సాగుపై దృష్టి పెట్టారు. కానీ పూర్తిస్థాయిలో వర్షాలు లేక వరి సాగు ఊపందుకోలేదు. ఈ సీజన్లో 2.85లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటివరకు 9,740 ఎకరాలకు సంబంధించి నార్లు పోశారు. మరో 6,585 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో సాగు మొదలుపెట్టారు. మొక్కజొన్న కూడా కేవలం 32ఎకరాల్లో సాగవుతోంది. ఈ సమయాన వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే ఇప్పటికే సాగైన పంటలకు ఊపిరి అందడమే కాక అంచనా మేర సాగు జోరందుకోనుంది.
బోర్లు, బావులే దిక్కు..
ఇప్పటివరకు మోస్తరు వర్షం తప్ప.. పంటలకు సరిపడా కురవలేదు. దీంతో పంటల సాగు అంతంతమాత్రంగానే ఉంది. ఓవైపు వరి నార్లు పోయగా, పత్తి విత్తనాలు విత్తారు. ఈ నేపథ్యాన పత్తి మొలకలను కాపాడుకునేందుకు రైతులు అవస్థ పడుతున్నారు. వర్షం కురవక బోర్లు, బావులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆ దిశగా దృష్టి సారిస్తున్నారు.
మొదట్లో కురిసిన వర్షాలతో
దుక్కులు దున్నిన రైతులు
ఆ తర్వాత వరుణుడి జాడ లేక
ఊపందుకోని పత్తి సాగు
పొడి దుక్కుల్లో విత్తిన అన్నదాతల్లో
ఆందోళన
ఇంకొన్ని రోజులు వాన రాకపోతే
కష్టమేనని ఆవేదన
వర్షాలు లేక.. మొలక రాక
ఈ ఫొటోలోని రైతు తిరుమలాయపాలెం మండలంలోని
ఎదుళ్లచెరువుకు
చెందిన నాగండ్ల మోహన్రావు. పది రోజుల క్రితం నాలుగెకరాల్లో పత్తి విత్తనాలు నాటాడు. అప్పటి నుంచి చిరుజల్లులు తప్ప మొలకలు వచ్చే స్థాయిలో వర్షం కురవడం లేదు. పత్తి విత్తనాలు నాటడానికి ఎకరాకు కూలీల ఖర్చుతో కలిపి రూ.5 వేలకు పైగా
వెచ్చించాడు. విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేక, మరోమారు నాటాలంటే ఆర్థిక భారం తప్పదని ఆందోళన చెందుతున్నాడు.
సాగు కష్టమే...
ఏటా మాదిరే ప్రకృతి మోసం చేసింది. పంట కాలం కంటే ముందే వాన పడడంతో పత్తి విత్తనాలు నాటాం. తీరా నాటాక వానల జాడ లేక పైకి వచ్చిన మొక్కలు, భూమిలో విత్తనాలు దెబ్బతిన్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మళ్లీ విత్తనాలు కొనాలంటే కష్టమే.
– తోట వెంకట్, కోయచలక
ఆదిలోనే ఎదురుతిరిగింది..
రోహిణకార్తెలోనే వాన కురవడంతో పత్తి సాగుపై ఆశతో ఎనిమిది ఎకరాల్లో విత్తనాలు వేశాం. కొంత మేర మొలక వచ్చినా మొక్క ఎదగడం లేదు. ఇదిలాగే ఉంటే పెట్టుబడి మొత్తం మట్టి పాలైనట్లే. నాతో సహా చాలా మంది నష్టం చవిచూడాల్సి వస్తుంది.
– చెరుకూరి కృష్ణారావు, రేగులచలక
నైరుతి.. కరుణ ఏదీ?
నైరుతి.. కరుణ ఏదీ?
నైరుతి.. కరుణ ఏదీ?
నైరుతి.. కరుణ ఏదీ?
నైరుతి.. కరుణ ఏదీ?