మానవ తప్పిదమేనా!? | - | Sakshi
Sakshi News home page

మానవ తప్పిదమేనా!?

Jun 20 2025 5:59 AM | Updated on Jun 20 2025 5:59 AM

మానవ తప్పిదమేనా!?

మానవ తప్పిదమేనా!?

● పెరుగుతున్న ’ఆఫ్‌టైప్‌’ ఆయిల్‌పామ్‌ బాధిత రైతులు ● గెలలు రాక ఏళ్ల శ్రమ వృథా అవుతోందని ఆవేదన ● రేగళ్లపాడు, దమ్మపేట నర్సరీల్లో ఇచ్చిన మొక్కలపైనే సందేహాలు

సత్తుపల్లి: ఆయిల్‌పామ్‌ తోటల్లో ఆఫ్‌టైప్‌ మొక్కల సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. తోటల్లో నానాటికీ ఆఫ్‌టైప్‌ మొక్కలు పెద్దసంఖ్యలో వెలుగు చూస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయిల్‌పామ్‌ సాగు పెంపే లక్ష్యంగా ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంటే, కొన్ని నర్సరీల సిబ్బంది తప్పిదాలతో ఆఫ్‌టైప్‌ మొక్కల సరఫరా జరుగుతోందనే ఆరోపణల వెల్లువెత్తుతున్నాయి. అయితే, వీటిని తొలినాళ్లలో గుర్తించే అవకాశం లేక.. నాలుగేళ్ల తర్వాత మరుగుజ్జు గెలలు, కొన్నింటికి అసలు గెలలే రాకపోవడంతో ఏటా రూ.లక్ష చొప్పున నాలుగేళ్లకు రూ.4లక్షల పెట్టుబడి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్‌పామ్‌ సాగుతో మంచి దిగుబడి, లాభాలు వస్తాయని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతుండగా, ఇప్పుడు ఎదురైన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.

చైర్మన్‌ పరిశీలించినా...

ఈ ఏడాది ఏప్రిల్‌ 24, 25వ తేదీల్లో ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో శాస్త్రవేత్తల బృందంతో కలిసి పర్యటించారు. పలుచోట్ల కాపురాని తోటలను పరిశీలించిన ఆయన రాష్ట్రంలోని 11 నర్సరీలకు గాను ఐదు నర్సరీల ద్వారా ఇస్తున్న మొక్కలతో సమస్య ఎదురవుతోందని తెలిపారు. ఆయా నర్సరీలను ప్రక్షాళన చేస్తే సగం సమస్యలు తీరతాయని చెప్పారు. ఇదే సమయాన కాపురాని తోటలకు పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పిన ఆయన, ఉద్యోగుల్లో ఎవరైనా తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇది జరిగిన రెండు నెలలు దాటుతున్నా ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలే లేకపోవడం గమనార్హం.

ఆ మొక్కల పంపిణీకి యత్నాలు

సత్తుపల్లి మండలం రేగళ్లపాడు నర్సరీలో తంబా రకానికి చెందిన 2.20 లక్షల మొక్కలను కల్లింగ్‌ చేస్తామని ప్రకటించినా, ఇప్పుడు రైతులకు అంటగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఐఓపీఆర్‌ సంస్థ ద్వారా విచారణ చేయిస్తే ఏవి నకిలీ, ఏవి అసలు మొక్కలో తేలుతాయని, ఇదే సమయాన తోటలను కూడా శాస్త్రవేత్తలతో పరిశీలన చేయించాలని కోరుతున్నారు. మరికొన్ని చోట్ల ఆయిల్‌పామ్‌ మొక్కల్లో జన్యులోపం వల్ల 30 – 40 కేజీలకు బదులు గెలలు 10 కేజీలు కూడా రావడం లేదని చెబుతున్నారు. ఈ విషయమై ఆయిల్‌ఫెడ్‌ అధికారులు, శాస్త్రవేత్తలు స్పందించి ఆయిల్‌పామ్‌ సాగు, నేలల రకాలపై రైతులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. కాగా, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఆఫ్‌టైప్‌ మొక్కలు వచ్చిన తోటలను ఇటీవల రాష్ట్ర రైతు సంఘం నాయకులు పరిశీలించారు. నర్సరీల్లో మావన తప్పిదాలతోనే వంధ్యత్వ మొక్కలు బయటకు వెళ్లాయని ఆరోపించిన వారు రైతులకు పరిహారంతో పాటు గెలలు టన్నుకు మద్దతు ధర రూ.25వేలు తగ్గకుండా చెల్లించాలని డిమాండ్‌తో ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

రెండు వేల ఎకరాల్లో సమస్య

సుమారు రెండు వందల మంది రైతులు సాగు చేస్తున్న రెండు వేలకు పైగా ఎకరాల ఆయిల్‌పామ్‌ తోటల్లో ఆఫ్‌టైప్‌ మొక్కల సమస్య ఉందని తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట,

దమ్మపేట నర్సరీల ద్వారా లక్షలాది మొక్కలు నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు అక్రమంగా రవాణా చేశారని చెబుతున్నారు. ఇదే సమయాన అశ్వారావుపేట మండలం దిబ్బగూడెంలోని తోటల్లో నాలుగేళ్ల క్రితం మొక్కలకు అంట్లు కట్టి నర్సరీల్లో పెంచి ఉమ్మడి జిల్లా రైతులకు ఇవ్వడంతోనే ఆఫ్‌టైప్‌ మొక్కలు వచ్చాయని రైతులు ఆరోపిస్తున్నారు. అలాగే, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోనూ ఆఫ్‌టైమ్‌ సమస్య వెలుగు

చూస్తున్నందున పూర్తిస్థాయిలో విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు

బయటపడతాయని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement