
రాజకీయ జోక్యమే కాపాడుతోందా?
● డీసీసీబీలో రూ.కోట్ల అక్రమాలపై విచారణకే పరిమితం ● నేడు మహాజన సభలో చర్చకు పట్టుబట్టే అవకాశం
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) 127వ మహాజన సభ శుక్రవారం జరగనుండగా, బ్యాంకులో ఏళ్ల క్రితం అక్రమాలపై పలువురు చర్చకు పట్టుబట్టే అవకాశముందని తెలుస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం ఖమ్మంలోని పలు బ్రాంచ్ల ద్వారా 21మంది ఇళ్ల నకిలీ ధ్రువపత్రాలతో రూ.6 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇవేకాక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బ్రాంచ్ల ద్వారా రుణాల మంజూరీలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. వీటిపై నాలుగేళ్లుగా వివిధ స్థాయిల్లో విచారణ జరుగుతుండగా, కేవలం ఒక ఉద్యోగిని సస్పెండ్ చేశారు. మిగతా బ్రాంచ్ల అధికారులు అక్రమాలకు కారణమని తెలిసినా ప్రధాన కార్యాలయంలో ఒక ఉద్యోగిని సస్పెండ్ చేయడంతోనే సరిపెట్టడం గమనార్హం. మిగతా వారికి రాజకీయ నాయకుల అండ ఉండడంతో విచారణల పేరిట కాలం వెళ్లదీస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కాగా, రూ.6కోట్ల రుణం తీసుకుని చెల్లించని వ్యవహారంపై గత పాలకవర్గం రాష్ట్ర సహకార బ్యాంకు(టస్కాబ్) దృష్టికి తీసుకెళ్లగా రాష్ట్ర సహకార శాఖ రిజిస్ట్రార్ విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ విచారణ అనంతరం నివేదిక సమర్పించినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారంపై కొద్దినెలల క్రితం జరిగిన సమావేశంలో డైరెక్టర్లు ప్రశ్నించారు. దీంతో శుక్రవారం జరిగే సమావేశంలో గట్టిగా నిలదీయాలని డైరెక్టర్లు భావిస్తుండడంతో, సభలో చర్చించేలా అజెండాగా చేర్చారు. అంతేకాక స్థానిక అధికారులతో విచారణ చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ విషయమై బ్యాంకు సీఈఓ వెంకటఆదిత్యను సంప్రదించగా రుణ అక్రమాలపై మహాజన సభలో నిర్ణయం తీసుకునే అవకాశముందని, సభ్యులు చర్చిస్తే విచారణకు తీర్మానిస్తామని తెలిపారు. అలాగే, ఏడాది క్రితం బ్యాంకులో జరిగిన పలు అక్రమాలపైనా సభ్యులు నిలదీయనున్నట్లు సమాచారం. కాగా, వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో పంట రుణాలు, పీఏసీఎస్ల ద్వారా ఎరువుల పంపిణీపై చర్చించేలా అజెండాలో చేర్చారు.