
వ్యవసాయ భూములన్నింటికీ ‘భరోసా’
● ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తున్నాం.. ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కూసుమంచి: వానాకాలం సీజన్ ఆరంభంలో రైతులు పెట్టుబడికి ఇబ్బంది పడకుండా రైతు భరోసా ద్వారా ఎకరాకు రూ.6వేలు జమ చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్నదాతలు విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనే పెట్టుబడి సాయం అందించడం ద్వారా వారి ఇక్కట్లు తీరనున్నాయని చెప్పారు. కూసుమంచి మండలం నర్సింహులగూడెం, పోచారం, పూర్యాతండా, చింతలతండా తదితర గ్రామాల్లో బీటీ, సీసీ రహదారుల నిర్మాణానికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ అవుతోందని తెలిపారు. సాగు యోగ్యమైన ప్రతీ ఎకరా భూమికి భరోసా అందుతుందని స్పష్టం చేశారు. అంతేకాక ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తున్నామని మంత్రి తెలిపారు. ఈక్రమంలో ఎదురవుతున్న ఆర్థిక ఇక్కట్లను అధిగమిస్తూ అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కాగా, కూసుమంచిలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యాన నిర్వహించిన పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి కేక్ కట్ చేసి మాట్లాడారు. దేశ ప్రజల తరఫున ప్రశ్నించే ఏకై క గొంతుక రాహుల్గాంధీదేనని తెలిపారు.