
నేడు, రేపు జాతీయ సదస్సు
ఖమ్మంసహకారనగర్: ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ జూనియర్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యాన శుక్ర, శనివారాల్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహమ్మద్ జకీరుల్లా తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి, తెలంగాణ సాహిత్య అకాడమీ తదితర విభాగాల ఆధ్వర్యాన శతజయంతి సాహితీమూర్తులు దాశరథి, ఆరుద్ర జీవితం, సాహిత్యంపై ఈ సదస్సు జరుగుతుందని వెల్లడించారు. కళాశాల విద్యా కమిషనర్ ఎ.శ్రీదేవసేనతో పాటు పలువురు కవులు, కళాకారులు హాజరవుతారని తెలిపారు.
సహాయ ఉపకరణాల
దరఖాస్తు గడువు పొడిగింపు
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వం దివ్యాంగులకు అందజేయనున్న సహాయ ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 27వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్రెడ్డి తెలిపారు. అర్హులైన దివ్యాంగులు https://tsobmms. cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆపై సంబంధిత పత్రాలను 27వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు కలెక్టరేట్లోని మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలనికాయన తెలిపారు.
నర్సింగ్లో నైపుణ్యాలతో మెరుగైన ఉపాధి
సత్తుపల్లి: నర్సింగ్ విద్యలో నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. సత్తుపల్లి మండలం కిష్టారంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆతర్వాత బేతుపల్లిలో జీలుగు సాగు, కొబ్బరి, ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటగా కోకో పంటలను పరిశీలించారు. అనంతరం రుద్రాక్షపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, యాతాలకుంటలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల పనులను పరిశీలించి, సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ఎంపీడీఓ నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహ, ఏడీఏ శ్రీనివాసరెడ్డి, ఏఓ శ్రీనివాసరావు, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జోష్న, హౌసింగ్ ఏఈ పవన్ పాల్గొన్నారు.
బీఏఎస్కు నేడు
విద్యార్థుల ఎంపిక
ఖమ్మంమయూరిసెంటర్: బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్) ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను గురువారం లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్లోని డీపీఆర్సీ సమావేశ మందిరంలో ఉదయం 10గంటలకు 1వ తరగతి విద్యార్థులు(డే స్కాలర్), మధ్యాహ్నం 2గంటల నుంచి ఐదో తరగతి విద్యార్థుల(రెసిడెన్షియల్) ఎంపికలు ఉంటాయని వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరుకావాలని డీడీ సూచించారు.
అవగాహనతోనే
సికిల్సెల్ నిర్మూలన
కారేపల్లి: సికిల్సెల్ అనేది వారసత్వంగా వచ్చే రక్తరుగ్మత సమస్య అని.. ప్రజలందరూ అవగాహన పెంచుకోవడం ద్వారా ఈ వ్యాధి నిర్మూలన సాధ్యమవుతుందని డీఎంహెచ్ఓ కళావతి తెలిపారు. కారేపల్లి మండలం గోవింద్తండాలో గురువారంస్థానికులకు సికిల్సెల్ పరీక్షలు నిర్వహించాక ఆమె మాట్లాడారు. ధర్తి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా సికిల్సెల్ పరీక్షల నిర్వహణతో పాటు అవగాహన కల్పిస్తూ పిల్లల్లో వ్యాధి నిర్మూలనకు పాటుపడుతున్నామని తెలిపారు. జన్యులోపాలతో ఎదురయ్యే ఈ వ్యాధి కారణంగా చిన్నారుల్లో గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని చెప్పారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్రత్యేక విభాగం ఏర్పాటుచేసినందున సద్వియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్వీబీడీసీ ప్రోగ్రామ్ అధికారి వెంకటరమణ, ఎంపీడీఓ సురేందర్, ఎంపీఓ రవీంద్రప్రసాద్, వైద్యాధికారి సురేష్ పాల్గొన్నారు.

నేడు, రేపు జాతీయ సదస్సు