
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలి
ఖమ్మంరూరల్: ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఏదులాపురంలో గురువారం పర్యటించిన ఆయన ఇళ్ల పురోగతిని పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. నిర్మాణానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, తొలిదఫా బిల్లులు అందాయా అని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణం చేపడుతుంటే ఎప్పటికప్పుడు బిల్లులు జమ అవుతాయని తెలిపారు. కాగా, కూపన్ల ద్వారా ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సును పరిశీలించి పలువురి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆతర్వాత ఏదులాపురం చెరువు కబ్జాపై ఫిర్యాదులు అందుతున్నందున సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డికి సూచించారు. అనంతరం ఏదులాపురం చెరువు, మిషనన్ భగీరథ ఇన్ టేక్వెల్, పంప్ హౌస్ను కూడా కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు.
పల్లె దవాఖానాలో మెరుగైన వైద్యం
పల్లె దవాఖానా ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఏదులాపురంలోని పల్లె దవాఖానా, అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన గర్భిణులకు అందుతున్న సేవలపై ఆరా తీయడమే కాక బీపీ చెక్ చేయించుకున్నారు. ఏఎన్ఎం సెలవులో ఉన్నట్లు తెలుసుకున్న ఆయన డీఎంహెచ్ఓను ఫోన్లో ఆరాతీశారు. ఆతర్వాత అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ పిల్లల హాజరు, సిబ్బంది వివరాలను పరిశీలించి పిల్లలతో మాట్లాడారు. తహసీల్దార్ పి.రాంప్రసాద్ వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి