
ప్రతీ విద్యార్థికి మూడు పుస్తకాలు
వైరా: వేసవి సెలవుల్లో ప్రతీ విద్యార్థికి పాఠశాల నుండి మూడు పుస్తకాలు అందించాలని, తద్వారా సెలవుల్లోనూ చదువుపై ఆసక్తి తగ్గకుండా చూడొచ్చని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. అంతేకాక ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఇంగ్లిష్పై భయం తగ్గించి, భవిష్యత్ లక్ష్యాలను ఏర్పాటు చేసుకునేలా చూడాలని సూచించారు. వైరాలోని ప్రభుత్వ ఉన్నత పాఠఽశాలను సోమవారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరంలో అన్ని పాఠశాలల్లో రీడింగ్ క్లబ్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆరో తరగతిలో విద్యార్థులతో ఇంగ్లిష్ పాఠం చదివించగా, ఒకరు సరిగ్గా చదవకపోవడంతో ఇంగ్లిష్ అంటే భయం విడనాడాలని సూచించారు. అలాగే, క్రీడల్లో ఆసక్తి పెరిగేలా పాఠశాలలో క్రికెట్, వాలీబాల్ కోర్టులు ఏర్పాటు చేయిస్తామని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండటంతో హెచ్ఎంపై అసహనం వ్యక్తం చేశారు. ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వరరావు, తహసీల్దార్ కే.వీ.శ్రీనివాస్, హెచ్ఎం మాధవరావు, ఉద్యోగులు పాల్గొన్నారు.
కెరీర్ గైడెన్స్పై అవగాహన
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 8వ తరగతి నుంచే కెరీర్ గైడెన్స్పై అవగాహన కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్రెడ్డితో కలిసి లైబ్రరీ, రీడింగ్ క్లబ్ల ఏర్పాటు, మా పాప – మా ఇంటి మణిదీపం, సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలపై సమీక్షించారు. విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకునేలా కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. అలాగే, సన్నబియ్యం లబ్ధిదారుల ఇళ్లలో ఆడపిల్ల పుడితే వారితో కలిసి అధికారులు భోజనం చేయాలన్నారు. ఈసమావేశంలో డీఆర్వో ఏ.పద్మశ్రీ, డీఆర్డీఓ ఎన్.సన్యాసయ్య, కలెక్టరేట్ ఏఓ అరుణ పాల్గొన్నారు.
సెలవుల్లో చదువుకునేలా ప్రత్యేక దృష్టి
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్