
పర్యావరణ పరిరక్షణకు..
● విద్యార్థుల్లో అవగాహన పెంచేలా విస్తృత కార్యక్రమాలు ● యూత్ అండ్ ఎకో క్లబ్ల ఏర్పాటు ● పీఎస్లకు రూ.3వేలు, హైస్కూళ్లకు రూ.5వేలు విడుదల
ఖమ్మం సహకారనగర్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే వివిధ కార్యక్రమాలు కొనసాగుతుండగా.. ఇటీవల పాఠశాల స్థాయిలో ‘యూత్ అండ్ ఎకో క్లబ్’ పేరుతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో 1,148 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా సుమారు 84 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల స్థాయిలో పర్యావరణ హిత కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థులను చైతన్యవంతులను చేసేందుకు ఒక్కో హైస్కూల్కు రూ.5వేలు, ప్రాథమిక పాఠశాలలకు రూ.3 వేల చొప్పున మొత్తం 42.36 లక్షల నిధులను ఇటీవల ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
నిధుల వినియోగం ఇలా..
పాఠశాలలకు విడుదల చేసిన నిధులతో కిచెన్ గార్డెన్ల సంరక్షణ, వినాయక చవితి సందర్భంగా మట్టి ప్రతిమల తయారీ, ఓజోన్ డే, ఎర్త్ డే, వాటర్ డే తదితర కార్యక్రమాలు చేపట్టాలి. ఆయా అంశాలపై కాంప్లెక్స్ స్థాయిలో పోటీలు నిర్వహించాలి. అలాగే పెద్ద ప్లాస్టిక్ టబ్బులు(40లీటర్లు) 2, మల్టీ పర్పస్ ప్లాస్టిక్ ట్రేలు 2, అలంకరణ మొక్కలు పెంచేందుకు 8 రౌండ్ ప్లాస్టిక్ తొట్లు, విత్తనాలు మొలకెత్తేందుకు ఒక ట్రే కొనుగోలు చేయాలి.
పీడీలకు పూర్తయిన శిక్షణ
యూత్ అండ్ ఎకో క్లబ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాకు చెందిన 20 మంది ఫిజికల్ డైరెక్టర్లు(పీడీ)లకు ఇటీవల హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు.
వారంతా ఆయా పాఠశాలల్లో పర్యావరణ హితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కిచెన్ గార్డెన్ల పెంపకం, విద్యార్థులకు మొక్కలపై ఆసక్తి పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహిస్తూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలోని పాఠశాలలకు విడుదలైన నిధులు.. (రూ.లలో)
మొత్తం ఒక్కో పాఠశాలకు మొత్తం
స్కూళ్లు విడుదలైన నిధులు
ప్రాథమిక పాఠశాలలు 752 3,000 22,56,000
ప్రాథమికోన్నత పాఠశాలలు 187 5,000 9,35,000
హైస్కూళ్లు 194 5,000 9,70,000
కేజీబీవీలు 14 5,000 70,000
అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ 01 5,000 5000
పర్యావరణంపై అవగాహన కలిగేలా
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో యూత్ అండ్ ఎకో క్లబ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీని ద్వారా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలుగుతుంది. అలాగే విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు కూడా అందిస్తోంది. ఇప్పటికే పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు నిర్వహిస్తున్న క్రమంలో మరింత ఉపయోగం కలుగనుంది.
– ఈ.సోమశేఖర శర్మ, డీఈఓ

పర్యావరణ పరిరక్షణకు..