బళ్లారి రూరల్: మనందరం దేవుని కృపకు పాత్రులు కావాలి. ప్రజలందరినీ దేవుడు సదా కాపాడాలని బళ్లారి పీఠం బిషప్ హెండ్రీ డిసోజా తెలిపారు. ఆదివారం సాయంత్రం బళ్లారి ఆరోగ్య మాత పుణ్యక్షేత్రంలో మేరీ మాత ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఏటా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు జెండా ఆవిష్కరించి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మేరీమాతను పల్లకీలో కొలువుదీర్చి చర్చి ప్రాంగణంలో ఊరేగించారు. మేరీమాత ఊరేగింపుకు వందలాది మంది క్రైస్తవులు, భక్తులు తరలివచ్చారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బెంగుళూరు ధర్మాధ్యక్షుడు డాక్టర్ ఆరోగ్యరాజ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలందరూ దేవుని కృపతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు. కన్నడ నాడులో వర్షాలు కురిసి నదులు, జలాశయాలు నిండి పాడిపంటలతో సుభిక్షింగా ఉండాలని దేవుడిని కోరుకున్నారు. కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర క్రిస్టియన్ అభివృద్ధి సంఘం అధ్యక్షుడు జి.జే.రవి కుమార్, ఫాదర్ ఆరోగ్యనాథన్, ఫాదర్ ఐవన్ఫింటో తదితరులు పాల్గొన్నారు.


