మండ్య: ఖజానాను ఖాళీ చేసి, రాష్ట్ర అభివృద్ధిని నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎప్పటికీ పురోగతి సాధ్యం కాదని బీజేపీ ఎంపీ, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి దారి పట్టాలంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన అన్నారు. ఆదివారం మండ్య జిల్లాలోని శ్రీరంగపట్నం వద్ద సంతేకసాలగెరెలో బీజేపీ నేత ఆధ్వర్యంలో మహిళలకు వాయన సమర్పణంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు అడుగంటాయి, ప్రగతిశీల ప్రాజెక్టులకు ప్రభుత్వం వద్ద డబ్బు లేదు అని విమర్శించారు. కావేరీ జలాలపై హక్కును కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, పొరుగు రాష్ట్రంలోని రైతుల పంటలకు నీళ్లు పోస్తూ, మన రైతులను పంటలు వేయవద్దని చెబుతున్న ప్రభుత్వాన్ని చూస్తే నాకు ఏడుపు వస్తోందని ఆయన వాపోయారు. దోపిడీలు, అవినీతి విపరీతంగా పెరిగిపోయాయి, అభివృద్ధి పక్కన పడిపోయిందని విమర్శించారు. రాష్ట్ర రాజకీయాలను మండ్య ఫలితాలే శాసిస్తాయన్నారు. బీజేపీ నేతలు అశోక్, ఎం.నాగరాజు, యదువీర్, తారా అనురాధ సతీష్ రెడ్డి, సచ్చిదానంద పాల్గొన్నారు.
మాజీ సీఎం బొమ్మై


