నీట్ విషయంలో గురువారం కూడా రాష్ట్రంలో నిరసనలు కొనసాగాయి. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్తోపాటు సంఘ సంస్థలు ఉద్యమించాయి. మరో వైపు కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ కూడా ధర్నాలు చేపట్టింది.
మండ్య: నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తూ వాటాల్ పార్టీ అధినేత వాటాల్ నాగరాజ్ గురువారం మండ్య నగరంలోని జయచామరాజ ఒడెయర్ సర్కిల్ వద్ద ధర్నా చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో 20 మందికి పైగా విద్యార్థులు మరణించారన్నారు. వీటన్నిటికీ బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో రైలు ప్రమాదం జరిగినప్పుడు అప్పటి రైల్వే మంత్రి లాల్బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వివిధ సంస్థలు డిమాండ్ చేశాయి. ప్రగతిశీల, కన్నడ అనుకూల సంఘాల నాయకులు నగరంలోని జే.సీ.సర్కిల్ వద్ద గుమికూడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేయబోతుండగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాటకు దారి తీసింది. చివరకు ఆందోళనకారులు దిష్టిబొమ్మను దహనం చేశారు.


