మంత్రి బావ.. అబ్కారీ అధికారిపై ఈడీ దాడులు | - | Sakshi
Sakshi News home page

మంత్రి బావ.. అబ్కారీ అధికారిపై ఈడీ దాడులు

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

బనశంకరి: బెళగావి జిల్లా ఎకై ్సజ్‌ శాఖ అదనపు కమిషనర్‌, మంత్రి సతీశ్‌ జార్కిహొళి బావ డాక్టర్‌ వై.మంజునాథ్‌ ఇంటితో పాటు 10కి పైగా ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్ర అధికారి మీద కేంద్ర అధికారుల దాడి ఇటీవలికాలంలో ఎన్నడూ జరగలేదు. బుధవారం ఉదయం బెళగావి సిటీలో దూరదర్శన్‌ కేంద్రం వద్దనున్న మంజునాథ్‌ నివాసం, అలాగే గోవా, బెంగళూరుతో పాటు పలు నగరాలలో సోదాలను ప్రారంభించారు.

ఎవరీ మంజునాథ్‌?

బళ్లారి మాజీ ఎంపీ వై .దేవేంద్రప్ప కుమారుడే మంజునాథ్‌, ఆయన మంత్రి సతీశ్‌ సోదరిని పెళ్లాడారు. ఎకై ్సజ్‌ శాఖ ఉన్నతాధికారిగా మంజునాథ్‌ పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాల సహాయంతో ఈడీ అధికారులు ఆయన ఇళ్లకు వచ్చారు. గేట్లు మూసివేసి లోపల కంప్యూటర్లు, మొబైల్‌ఫోన్లు, ఫైళ్ల పరిశీలన చేపట్టారు. బ్యాంకుల లావాదేవీలు, స్థిర చరాస్తుల వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. మైసూరులో స్నేహితుని ఇంటిలో తనిఖీలు సాగుతున్నాయి. బెంగళూరులోని మంజునాథ్‌ అపార్టుమెంట్‌, అథణి తాలూకా ఐనాపుర గ్రామంలో స్నేహితుని ఇంటిపై దాడిచేశారు. బినామీల పేరుతో భూముల కొనుగోలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల నిర్వహణతో పాటు అక్రమంగా పెద్దమొత్తంలో ఆస్తులను సంపాదించారని కొందరు ఈడీకి ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. దాడి సమయంలో ఆయన బెంగళూరులోని అపార్టుమెంట్‌లో ఉన్నారు.

మంజునాథ్‌ ఆప్తులపై

మంజునాథ్‌ ఆప్తులకు కూడా ఈడీ షాక్‌ ఇచ్చింది. తుమకూరు ఎకై ్సజ్‌శాఖ ఎస్పీ సతీశ్‌ కాగలికి చెందిన బెళగావి జిల్లా కాగవాడ తాలూకా ఐనాపుర పట్టణంలోని నివాసంలో సోదాలు జరిగాయి. అలాగే బెళగావి శ్రీనగరలోని ఇంట్లోనూ చేపట్టారు. జిల్లాలోని చిక్కోడి అబ్కారీ డీఎస్పీ విశ్వనాథ్‌ గాణిగెరకు చెందిన బెళగావి సిటీ బసవ కాలనీలో ఇంటిపైనా దాడులు చేపట్టారు. ఈ పరిణామాలతో మంజునాథ్‌ బంధుమిత్రులతో పాటు అబ్కారీ శాఖ అధికారుల్లో గుబులు నెలకొంది.

ఎందుకు దాడులు...

మంజునాథ్‌, అతని ఆప్తులపై ఈడీ.. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. అబ్కారీ శాఖలో అవకతవకలపై గతంలో ఆయనపై లోకాయుక్త దాఖలు చేసిన కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగినట్లు సమాచారం. మొత్తం 18 చోట్ల దాడులు చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

బెళగావిలోని నివాసాల్లో కేంద్ర బలగాల భద్రత మధ్య తనిఖీలు

ఎకై ్సజ్‌ అదనపు డీసీ వై.మంజునాథ్‌ లక్ష్యం.. బెంగళూరు, బెళగావి, మైసూరు సహా 10కి పైగా ప్రాంతాల్లో తనిఖీలు

ఆయన మంత్రి సతీశ్‌ జార్కిహొళికి స్వయానా బావ

అక్రమాస్తులు, స్కాం ఆరోపణలే కారణం

విజయనగర జిల్లాలో

హొసపేటె: మాజీ ఎంపీ వై.దేవేంద్రప్ప కుమారుడు, బెళగావి అబ్కారీ అధికారి వై.మంజునాథ్‌కు విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాలోని అరసికెరె గ్రామంలోని ఉన్న నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దాడి చేశారు. తెల్లవారుజామున 5:30 గంటలకు రెండు కార్లలో వచ్చిన అధికారులు నివాసాలకు వెళ్లారు. అక్కడి వారు ఎవరని ప్రశ్నించగా, ఈడీ అధికారులని చెప్పి సోదాలు ప్రారంభించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement