బనశంకరి: సిలికాన్ సిటీలో జల్సాలు, సహజీవనం, జీవితమంటే లెక్కలేకపోవడం వంటి పాశ్చాత్య జీవనశైలి యువతను పెడతోవ పట్టిస్తోంది. అది అనేక విషాదాలకు కారణమవుతోంది. తమ ప్రేమ, సహజీవనాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించారనే కసితో వారితో పాటు చెల్లెలిని కత్తులతో నరికి చంపిన టెక్కీలు శ్వేత, ఆమె ప్రియుడు కెన్నెత్ కేసులో కొత్త సంగతులు బయటపడుతున్నాయి. హత్యల తరువాత పరారైన శ్వేతను కృష్ణరాజపురం పోలీసులు అరెస్ట్చేశారు. ఆమె పాండిచ్చేరి రైల్వేస్టేషన్లో పట్టుబడిందని, ప్రియుడు కెన్నెత్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. తండ్రి సోమసుందర్(55), తల్లి ముత్తులక్ష్మీ (48), సోదరి సుప్రియా(20)ను శ్వేత, ప్రియుడు అతికిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. 6 ప్రత్యేక పోలీస్ బృందాలు పలు రాష్ట్రాల్లో గాలించి శ్వేతను అరెస్టు చేసినట్లు డీసీపీ సైదులు అడావత్ తెలిపారు. నిందితురాలి నుంచి సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు.
డైరీలో ఏముంది
డొమినిక్ లేఔట్లో హత్య జరిగిన అపార్టుమెంటు ఫ్లాటులో పోలీసులు గాలించి శ్వేత, కెన్నెత్లకు చెందిన సామగ్రిని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. శ్వేత రాసిన డైరీలో.. ఐయామ్ శాడ్, ఐయామ్ లోన్లీ, ఫీలింగ్ లవ్, ఐయామ్ డిప్రెస్డ్, ఐయామ్ సుపీరియర్ అని రాసుకుంది.
చదువులో ప్రతిభావంతులు...
శ్వేతా, కెన్నెత్ ఇద్దరూ న్యూ హొరైజాన్ కాలేజీలో బీటెక్ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. బీటెక్లో ఇద్దరూ కాలేజీ టాపర్గా నిలిచారు. తరువాత ఐటీ కంపెనీల్లో ఉద్యోగంలో చేరి లక్షలాది రూపాయల వేతనం గడించేవారు. అప్పటినుంచి సహజీవనంలో ఉంటున్నారు. పలు కారణాలతో ఏడాది నుంచి ఇద్దరు ఉద్యోగం వదిలివేశారు. ఉన్న డబ్బుతో మజా చేయసాగారు. సొంతంగా బిజినెస్ చేయాలని శ్వేత తల్లిదండ్రుల పేరుతో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ.30 లక్షలు అప్పు చేసింది. కానీ ఏ వ్యాపారమూ చేయలేదు. ఆ డబ్బుతో షికార్లు కొట్టారు. కంతులు కట్టకపోవడంతో ఆమె తల్లిదండ్రులకు బ్యాంకు నోటీసులు వెళ్లడంతో కంగుతిన్నారు. కెన్నెత్ తండ్రి హెచ్ఏఎల్లో పనిచేస్తూ మారతహళ్లిలో నివాసం ఉంటున్నారు. అతని ధోరణి చూసి తల్లిదండ్రులు పట్టించుకునేవారు కాదని తెలిసింది. ఇలా ఇద్దరూ వికల మనస్కులయ్యారు.
తండ్రి సోమసుందర్
తల్లిదండ్రులు, సోదరి హత్య కేసు...
టెక్కీ శ్వేత, ప్రియుడు కెన్నెత్ పెడదారి
పాండిచ్చేరిలో శ్వేత అరెస్టు
30 కత్తిపోట్లతో ఊచకోత
హత్య సమయంలో ముగ్గురినీ 30 సార్లు చాకులతో పొడిచారని తేలింది. బ్యాంక్ నోటీసులు రావడంతో కంగారుపడిన తల్లిదండ్రులు శ్వేతతో మాట్లాడాలని వెళ్లారు. అక్కడ కెన్నెత్ను చూసిన ముత్తులక్ష్మి.. నా కూతురిని చెడగొట్టావని మండిపడడంతో ఘర్షణ ఆరంభమైంది. సహనం కోల్పోయిన శ్వేతా చాకుతో తల్లిని పొడిచింది. ఇంతలో తండ్రి సోమసుందర్ , చెల్లి సుప్రియా రావడంతో వారినీ అదే మాదిరిగా హతమార్చారు. తరువాత టెర్రెస్పైకి వెళ్లి అక్కడి నుంచి పక్క అపార్టుమెంటులోకి దూకి పారిపోయారు.


