హొసపేటె: వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ( నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ)ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నగరంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ మేరకు వారు తహసీల్దార్ ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రాన్ని సమర్పించారు. కాంగ్రెస్ నేత భరత్కుమార్ మాట్లాడుతూ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎన్ఏటీ నిర్వహించిన నీట్ యూజీ– 2026 పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహిస్తామని ప్రకటించిందన్నారు. పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ తన అసమర్థతను మరోసారి నిరూపించుకుందని విమర్శించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాయచూరులో..
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ హయాంలో జరిగిన నీట్ పరీక్షల్లో అక్రమాలపై విచారణ జరిపి, ఎన్టీఏను రద్దు చేయాలని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. గురువారం టిప్పు సుల్తాన్ ఉద్యానవనం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బసవరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీన జరిపిన నీట్ పరీక్షల్లో అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. పరీక్షను రద్దు చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం తగదన్నారు. మూడేళ్లలో ఇలా రెండోసారి జరిగిందని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎన్టీఏను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.


