
సోషల్.. అలర్ట్
బనశంకరి: ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టా గ్రాం, టెలిగ్రాం, వాట్సాప్, యూట్యూబ్ వంటి ఇంటర్నెట్ మాధ్యమాలలో పోస్టులు పెట్టేవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. చేతిలో ఫోన్ ఉంది కదా అని ఆదమరిస్తే ఇబ్బందుల్లో పడవచ్చు. మంచికి ఉపయోగించడం ఒక వైపు అయితే, ఇతరులను, ఇతర వర్గాలను మానసికంగా వేధించడం, దూషించి కించపరచడం, రెచ్చగొట్టేలా చేసే పోస్టులు చేయడం నాణేనికి రెండో వైపు వంటిది. దీనిపై పోలీస్ శాఖ నిఘా పెట్టింది. ఇలాంటి పోస్టులు పెట్టేవారిపై సుమోటోగా కేసుల నమోదుకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల సగటున రెండు రోజుల్లో కనీసం మూడు ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి.
2023 నుంచి..
ఇంటర్నెట్ పోస్టుల గురించి రాష్ట్రంలో 2023 నుంచి 2025 జూన్ వరకు 1,414 కేసులను పోలీసులు నమోదు చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ శాఖ ప్రత్యేకంగా 3,138 ఖాతాలపై కన్నేసింది. రెండున్నర ఏళ్లలో 1,133 మందిని అరెస్ట్ చేశారు. నేరారోపణలు వచ్చిన 178 అకౌంట్లను బ్లాక్ చేశారు. రెచ్చగొట్టే ప్రసంగం చేశారని 218 కేసులు పెట్టి 127 మందిని కటకటాలకు తరలించారు.
ఫిర్యాదు చేయకున్నా సరే..
కొన్నేళ్లుగా రాజకీయ నేతలు, ప్రముఖ వ్యక్తులు, సినిమా తారల మీద కించపరిచే పోస్టులు ఎక్కువయ్యాయి. వీటిమీదే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. నమోదైన కేసుల్లో 70 శాతం పోలీసులు స్వయం ప్రేరితంగా నమోదు చేసినవే. అంతేగాక నకిలీ పోస్టులు, యువతుల అసభ్య ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన నేరాలు అధికంగా ఉంటున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాలు ఎస్పీల ఆఫీసుల్లో సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతున్న నకిలీ పోస్టులు, నేరపూరిత అంశాలపైన నిఘా పెట్టడానికి ప్రత్యేక సెల్స్ని ఏర్పాటు చేశారు. సీఐ నేతృత్వంలో బృందాలు నిరంతరం పరిశీలిస్తుంటాయి.
మూడేళ్ల జైలు తప్పదు
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలపై 153ఏ, 295ఏ, 298, 505 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు. బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్, సమాచార సాంకేతిక పరిజ్ఞానం చట్టం 2000, ఐటీ యాక్ట్ ప్రత్యేక చట్టం 66ఏ ,69ఏ ల ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. మూడేళ్లు జైలు, జరిమానా లేదా రెండు విధింవచ్చని పోలీసు అధికారులు తెలిపారు.
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది అందరి చేతిలో ఇమిడిపోయింది. దానిని దుర్వినియోగం చేస్తే కటకటాల పాలు కాక తప్పదు. మనుషులు, వర్గాల మధ్య విద్వేషాలను సృష్టించేలా పోస్టులు పెట్టేవారిపై పోలీసుశాఖ ప్రత్యేకంగా నిఘా వేసింది. దీంతో తేడా పోస్టులు పెట్టేవారి ఇట్టే దొరికిపోతున్నారు. కాబట్టి సోషల్ మీడియాను మంచిగా వాడడమే మేలు.
సామాజిక మాధ్యమాలపై పోలీసుల నిఘా
విద్వేష పోస్టులపై కేసులు, అరెస్టులు
రెండున్నర ఏళ్లలో 1,133 మంది అరెస్టు
పోస్టులు.. తీవ్ర ఘర్షణలు
సోషల్ మీడియాలో అవహేళనగా పోస్టు పెట్టారని బెంగళూరు డీజే.హళ్లి, కేజే హళ్లిలో భారీ ఘర్షణలు జరిగాయి. మైసూరు నగరంలో ఉదయగిరి పోలీస్స్టేషన్ ముట్టడి, గొడవలు జరిగాయి. శివమొగ్గ జిల్లాలో జిహాదిస్టులు బాంబు పేలుడును జరిపి వీడియోను అప్లోడ్ చేయడం వంటివి కొన్ని ఉదంతాలున్నాయి. ఇటీవల ఆపరేషన్ సింధూర్ని, ప్రధాని మోదీని దూషిస్తూ కొందరు పోస్టులు చేయగా అరెస్టు చేశారు. విద్వేషపూరిత పోస్టును చూడగానే పోలీసులు సోషల్ మీడియా అకౌంట్దారుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటారు. అంతేగాక అన్ని పార్టీల సోషల్ మీడియా ఖాతాల్లో ఏం పోస్టు చేస్తున్నారనేది చూస్తుంటారు.

సోషల్.. అలర్ట్

సోషల్.. అలర్ట్