
టీసీఎస్ లేఆఫ్లపై సర్కారు దృష్టి
శివాజీనగర: ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ పెద్ద స్థాయిలో ఐటీ ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. టీసీఎస్ 12 వేల మంది ఉద్యోగులను తీసేస్తోందనే వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆ సంస్థను కోరినట్లు కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ తెలిపారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, టీసీఎస్తో లేఆఫ్కు కారణాలపై సమాలోచన జరుపుతామన్నారు. గత ఐదేళ్లుగా సన్రైజ్ పేరిట అనేక సంస్థలకు కార్మిక చట్టాల నుంచి మినహాయింపులు ఇచ్చాం, కంపెనీలు ఎవరినైనా ఉద్యోగాల నుంచి తొలగిస్తే మాకు ఆ సమాచారం ఇవ్వాలి. ఎందుకు, ఏమిటి అనేది మాట్లాడుతామని మంత్రి తెలిపారు.
నవంబరులో బీబీఎంపీ ఎన్నికలు!
బనశంకరి: నవంబరులో బీబీఎంపీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ను దాఖలు చేసింది. బీబీఎంపీ ఎన్నికల పిటిషన్ సోమవారం విచారణకు రానుండడంతో అంతలోగా లిఖితపూర్వకంగా వివరాలు అందించాలని ధర్మాసనం సర్కారు తరఫు న్యాయవాదులకు ఆదేశించింది. బీబీఎంపీ వార్డుల విభజన, సరిహద్దులు, రిజర్వేషన్ ప్రక్రియ, ఓటర్ల జాబితా సిద్ధం చేయడం తదితర ప్రక్రియలు ఉన్నట్లు కోర్టుకు వివరించారు. నవంబరులోగా పూర్తి ప్రక్రియ పూర్తిచేస్తామని, ఇప్పటికే 50 శాతం పనులు పూర్తిచేశామని అఫిడవిట్లో పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా బెంగళూరు పాలికెకు ఎన్నికలు జరగలేదు.
ఆరడుగుల కోసం ఆక్రోశం
చింతామణి: రంగేనహళ్లిలో ఆరడుగుల కోసం రగడ ఏర్పడింది. పూర్వం నుంచి గ్రామస్తులు చనిపోతే గ్రామ శివార్లలోని సర్వే నంబరు 8 స్థలంలోని స్మశానంలో పూడ్చేవారు. అయితే ఆ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని, మృతదేహాలను పూడ్చరాదని హెచ్చరించారు. శుక్రవారం తాలూకాలోని రంగేనహళ్లిలో చెందిన కొండప్ప (60) అనే వృద్దుడు అనారోగ్యంతో మరణించాడు. బంధువులు అంత్యక్రియల కోసం తీసుకెళ్లగా కొందరు అడ్డుకున్నారు. గత్యంతరం లేక న్యాయం చేయాలని శవాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళన చేశారు. తహశీల్దార్ సూచనతో సర్వే సిబ్బంది అక్కడ సర్వే చేపట్టారు. ఇంతలో మరోచోట అంత్యక్రియల్ని పూర్తిచేశారు.
కంఠీరవ సహోదరి కన్నుమూత
మైసూరు: కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్కుమార్ సహోదరి నాగమ్మ శుక్రవారం చామరాజనగర జిల్లా సరిహద్దులో ఉన్న తాళవాడి సమీపంలోని గాజనూరులోని నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 94 ఏళ్లు, వయోభారంతో బాధపడుతోంది. ఆమెకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం అంత్యక్రియలు జరగనున్నాయి. వెంటనే రాజ్కుమార్ తనయుల కుటుంబాలు గాజనూరుకు బయలుదేరాయి. నాలుగేళ్ల కిందట రాజ్కుమార్ చిన్నకుమారుడు పునీత్ మరణించడం తెలిసిందే. ఆ విషయాన్ని ఇప్పటికీ నాగమ్మకు చెప్పలేదు. పునీత్ అంటే నాగమ్మకు ఎంతో ఇష్టం. పునీత్ తరచూ ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించేవాడు. పునీత్ లేడని తెలిస్తే నాగమ్మ భరించలేదని అప్పటినుంచి ఆమెకు తెలియకుండా ఉంచారు. చివరికి పునీత్ మరణ వార్త తెలియకుండానే నాగమ్మ మరణించడం గమనార్హం.

టీసీఎస్ లేఆఫ్లపై సర్కారు దృష్టి

టీసీఎస్ లేఆఫ్లపై సర్కారు దృష్టి