
గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడపాలి
రాయచూరు రూరల్: పంచ గ్యారెంటీల పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు, విద్యార్థులకు ఇబ్బందులు మొదలయ్యాయని విద్యార్థులు, మాదిగ దండోరా నాయకులు ఆరోపించారు. వారు గురువారం రాయచూరు తాలూకా తుంటాపుర వద్ద చేపట్టిన ఆందోళననుద్దేశించి సంచాలకులు రంజిత్ మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు జిల్లా, తాలూకా కేంద్రాలకు వెళ్లి చదువుకోడానికి వేళకు సరిగా బస్సు సౌకర్యం తక్కువగా ఉందన్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి వీలుగా బస్సు రూట్ల సంఖ్యను తగ్గించడాన్ని ఖండించారు. ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం కల్పించేంత వరకు ఆందోళన విరమించబోమంటూ సుమారు రెండు గంటల పాటు వాహన రాకపోకలను నిలిపి వేశారు. దీంతో గురువారం మంత్రాలయం వెళ్లే, వచ్చే ప్రయాణికులు పలు ఇబ్బందులు పడ్డారు. రాయచూరు, ఆదోని, కర్నూలు, శ్రీశైలం, విజయవాడ, ద్రాక్షారామం వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు నానాయాతనకు గురయ్యారు. అనంతరం అక్కడకు వచ్చిన రాయచూరు డివిజనల్ ఆర్టీసీ కంట్రోలర్ చంద్రశేఖర్కు వినతిపత్రం సమర్పించారు. ఇకపై తుంటాపుర వద్ద కంట్రోలర్ను నియమించి బస్సులను ఆపేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.

గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడపాలి