
పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరం
హొసపేటె: బాలల, కౌమార కార్మిక చట్టం–1986 ప్రకారం 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరం అని తహసీల్దార్ అమరేష్ అన్నారు. నగరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం–2025 నిర్వహించారు. తాలూకా యంత్రాంగం, తాలూకా పంచాయతీ, విద్య, కార్మిక, పోలీసు శాఖలు, జిల్లా బాల కార్మిక పథకం, యూనిట్ ఛారిటబుల్ ట్రస్ట్, ప్రభుత్వ జాయింట్ పీపీ బాలుర ఉన్నత పాఠశాల, కళాశాలల సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పని అప్పగించిన నేరానికి 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారన్నారు. అంతేగాకుండా పని అప్పగించిన తల్లిదండ్రులను కూడా శిక్షిస్తారన్నారు. ప్రభుత్వం నేడు పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అందిస్తోందన్నారు. ప్రతి బిడ్డకు అది లభించేలా చూడటం ప్రతి పౌరుడి విధి అన్నారు. అందువల్ల బాల కార్మికుల నిర్మూలనలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమన్నారు. ఈ వ్యవస్థ పిల్లల పెరుగుదలను అడ్డుకుంటుందని, కనుక అవగాహన అవసరమని ఆయన అన్నారు.