
బనశంకరి: సిలికాన్ సిటీలో సైబర్ కేటుగాళ్లు సరికొత్త మోసాలతో హడలెత్తిస్తున్నారు. విస్తృతమైన ఇంటర్నెట్ వాడకాన్ని ఆసరాగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. నగరంలోని ఐటీ బీటీ ఉద్యోగులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, విద్యావంతులను టార్గెట్ చేసుకుని నగదు కొల్లగొడుతున్నారు. సోషల్ మీడియాలో స్టార్ రేటింగ్ ఇస్తే చేతినిండా కమీషన్ ఇస్తామని ఆశ చూపించి ఓ వ్యక్తి నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.1.51 కోట్లు దోచేశారు. బెంగళూరు దక్షిణ పరిధి గిరినగరకు చెందిన 62 ఏళ్ల వ్యక్తి బాధితుడు. దక్షిణ విభాగ సీఈఎన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మార్చి 23న ఫిర్యాదుదారుడి వాట్సాప్కు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి, సోషల్ మీడియాలో టాస్క్ ఇస్తారని, దీనికి రేటింగ్ ఇస్తే చేతినిండా సంపాదించవచ్చు ఒకసారి ఫైవ్స్టార్ రేటింగ్ ఇస్తే రూ.2 వేలు అందుతుందని ఆశపెట్టారు. దీంతో ముందుగా ఫిర్యాదుదారుడికి టాస్క్ ఇచ్చారు. ఫైవ్స్టార్ రేటింగ్ ఇచ్చిన ఇతడి వ్యాలెట్కు నగదు జమ చేశాడు. అనంతరం టెలిగ్రామ్గ్రూప్లో చేర్చుకుని కాయిన్నెట్ అనే వెబ్సైట్లో కాయిన్ ట్రేడింగ్ చేయవచ్చు. ఇందులో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆశ చూపెట్టారు. దురాశకు పోయిన బాధితుడు వంచకులు గుట్టు తెలియక దశలవారీగా రూ.1.51 కోట్లు పెట్టుబడి పెట్టారు. కానీ ఎలాంటి లాభం రాలేదు. చివరికి పెట్టిన డబ్బు వెనక్కితీసుకోవాలని ఫోన్ చేయగా అందుబాటులోకి రాకపోవడంతో వంచనకు గురైనట్లు గుర్తించిన బాధితుడు సీఈఎన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
కాంట్రాక్టర్కు రూ.3.96 లక్షలు వంచన
గతనెల 30న ఉత్తరహళ్లికి చెందిన కాంట్రాక్టర్ మొబైల్కు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి. మీ పేరుతో ముంబై నుంచి రష్యాకు పంపుతున్న కొరియర్లో డ్రగ్స్ ఉన్నట్లు తెలియడంతో మీపై కేసు నమోదైంది. తక్షణం ముంబై పోలీసులకు వీడియోకాల్ చేయాలని మొబైల్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ చేయడంతో ఫోన్ తీసిన వ్యక్తి ముంబై పోలీస్ అని పరిచయం చేసుకుని ఐడీకార్డ్ చూపించాడు. అక్రమంగా కోట్లాది రూపాయలు ఆర్థిక కార్యకలాపాలు జరిగాయని మనీల్యాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదైంది. దీంతో మీ బ్యాంకు అకౌంట్లో ఉన్న నగదు ఆర్బీఐకి జమ చేయాలని దర్యాప్తు పూర్తయిన వెంటనే వెనక్కి ఇస్తామని తెలిపారు. భయపడిపోయిన కాంట్రాక్టర్ గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కు రూ.3.96 లక్షలు జమ చేశాడు. కొద్ది సమయం అనంతరం ఫోన్ చేయగా మొబైల్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో వంచనకు గురైనట్లు తెలుసుకుని సుబ్రమణ్యపుర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
డాక్టరుకు రూ.27.71 లక్షలు టోకరా
సీనియర్ డాక్టర్కు ముంబయి పోలీసుల ముసుగులో ఫోన్ చేసిన వంచకులు కేసు నమోదు చేస్తామని బ్లాక్మెయిల్కు పాల్పడి రూ.27.71 లక్షలు దోచేశారు. పద్మనాభనగర నివాసి బాధితుడు. గతనెల 26న ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి ముంబై పెడెక్స్ ఎక్స్ప్రెస్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నామని పరిచయం చేసుకున్నారు. మీ పేరుతో అనధికారికంగా తైవాన్కు పార్శిల్ వెళుతుంది. అందులో 5 పాస్పోర్ట్స్, 3 బ్యాంక్ క్రెడిట్కార్డ్స్, 200 గ్రాములు ఎండీఎంఏ , రూ.35 వేల నగదు, నాలుగు కిలోలు దుస్తులు, ల్యాప్టాప్ ఉన్నాయని తక్షణం ముంబైకి వచ్చి ఫిర్యాదు చేయాలని లేనిపక్షంలో మీపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. భయభ్రాంతులకు గురైన డాక్టరు గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన మొబైల్ నెంబరుకు వాట్సాప్ కాల్ చేశారు. ఫోన్ తీసిన వ్యక్తి ముంబై సైబర్ క్రైం పోలీస్ అని పరిచయం చేసుకుని ఐడీకార్డు చూపించాడు. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎక్కడికి వెళ్లరాదని ఆర్బీఐ మార్గదర్శకాలు అని లెటర్ను వాట్సాప్ చేశారు. దీని ప్రకారం మీ బ్యాంకు అకౌంట్లో ఉన్న నగదు ఆర్బీఐ అకౌంట్కు జమ చేయాలి. దర్యాప్తు పూర్తయిన వెంటనే మీ అకౌంట్కు నగదు వేస్తామని తెలిపారు. ఇతడి మాటలు నమ్మిన డాక్టరు తన బ్యాంకు అకౌంట్లో ఉన్న రూ.27.71 లక్షలు నగదు వంచకులు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కు జమచేశాడు. అనంతరం డాక్టర్ ఫోన్ చేయగా మొబైల్ స్విచ్చాఫ్ రావడంతో మోసపోయినట్లు గుర్తించి సీఈఎన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ట్రే డింగ్ పేరుతో ఓ వ్యక్తికి రూ. రూ.1.51 కోట్లు
మనీ లాండరింగ్ పేరుతో మరొకరికి రూ. 3.96 లక్షలు
పార్సిల్ పేరుతో డాక్టర్ను బెదిరించి రూ. 27.71 లక్షల వంచన
